పృథ్వీ-2 బాలిస్టిక్ మిస్సైల్ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్లోని ఐటీఆర్ లాంచింగ్ కాంప్లెక్స్-3 నుంచి బుధవారం రాత్రి 7.40 గంటలకు డీఆర్డీవో మిస్సైల్ను పరీక్షించగా.. విజయవంతమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) దేశీయంగా అభివృద్ధి చేసింది. ట్రైనింగ్ లాంచ్లో మిస్సైల్ ఖచ్చిత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిస్సైల్.. 350 కిలోమీటర్ల పరిధిలోకి రేంజ్ను కలిగి ఉంటుంది. ఇందులో ద్రవ ఇంజిన్లు ఉన్నాయి. ఈ క్షిపణిని గత ఏడాది నవంబర్, డిసెంబర్లలో కూడా విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. రెండు లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్లను కలిగిన పృథ్వీ-2.. 500/100 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. 9 మీటర్ల పొడవు, సింగిల్-స్టేజ్ ద్రవ ఇంధనంతో పనిచేసే పృథ్వీ-2 మిస్సైల్ తొలిసారిగా 1996లో ప్రయోగించారు. 2003లో భారత సాయుధ దళాలలోకి ప్రవేశించింది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన మొదటి క్షిపణి ఇదే.