Polavaram Tragedy: ఏపీలోని పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని దామనపల్లి, బోర్నగూడెం గిరిజన గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులు ఒకే ప్రియుడి కోసం ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. దామనపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి ఈ నెల 13వ తేదీన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకుని ప్రాణాలు విడిచింది. ఆ ఘటన జరిగిన నాలుగు రోజులు గడవక ముందే, బోర్నగూడెం గ్రామానికి చెందిన మరో యువతి (34) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒకే యువకుడిని ఇద్దరు యువతులు ప్రేమించడమే ఈ దారుణానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన ప్రియుడి విషయంలో ఈ ఇద్దరు యువతుల మధ్య తీవ్ర వివాదం చెలరేగడమే కాకుండా, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం. ఆ గొడవ జరిగిన మరుసటి రోజు నుంచే వరుసగా ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనలపై దేవీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతుల మృతికి గల పూర్తి కారణాలపై పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు.
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..

Ap News
