పాకిస్థాన్ గవర్నమెంట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు వ్యవహారంలో కోర్టులో పీఓకే కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) విదేశీ భూభాగమని పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హై కోర్టులో అంగీకరించింది. అక్కడ తమ దేశానికి సంబంధించిన చట్టాలు.. వర్తించవని తేల్చి చెప్పింది. పాత్రికేయుడి కిడ్నాప్ కేసుపై శుక్రవారం విచారణ సందర్భంగా పాకిస్థాన్ అదనపు అటార్నీ జనరల్ ఇస్లామాబాద్ కోర్టులో ఈమేరకు వ్యాఖ్యానించారు. రావల్పిండిలోని తన ఇంట్లో ఉన్న అహ్మద్ ఫర్హద్ షా అనే పాత్రికేయుడిని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ మే 15న కిడ్నాప్ చేసింది. దీనిపై ఆయన భార్య అక్కడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం జస్టిస్ మోసిన్ అక్తర్ కయాని నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పాత్రికేయుడిని అహ్మద్ ఫర్హద్ను కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున అదనపు అటార్నీ జనరల్ వాదిస్తూ… ప్రస్తుతం అహ్మద్ ‘పీవోకే’లో పోలీస్ కస్టడీలో ఉన్నట్లు కోర్టుకు వెల్లడించారు. అది విదేశీ భూభాగమని, అక్కడ ప్రత్యేక రాజ్యాంగం, చట్టాలు ఉంటాయని, పాకిస్థాన్ చట్టాలు చెల్లబోవని తేల్చేశారు.
READ MORE:Dinesh Karthik: క్రికెట్ కి గుడ్ బై చెప్పిన దినేశ్ కార్తిక్
ఈ అంశంపై జస్టిస్ కయానీ మాట్లాడుతూ.. ఒకవేళ పీవోకే విదేశీ భూభాగమైతే.. పాకిస్థాన్ రేంజర్లు, పాక్ మిలటరీ ఎందుకు ఆ ప్రాంతంలోకి చొరబడుతున్నారని ప్రశ్నించింది. సామన్యులను విచారణ పేరుతో ఇంటెలిజెన్స్ సంస్థలు బలవంతంగా నిర్బంధించడాన్ని తప్పని స్పష్టం చేసింది. మరోవైపు పాక్ న్యాయవాది వ్యాఖ్యలతో భారత్కు మరింత బలం చేకూరినట్లయింది. ‘పీవోకే’ భారత్లో అంతర్భాగమని, అది 1947 నుంచి పాక్ ఆక్రమణలో ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ పలు మార్లు చెప్పారు. పీవోకే ఎప్పటికీ భారత్తోనే ఉంటుందని, అది భారత్లోనే ఉంటుందని వివిధ సందర్భాల్లో ఆయన స్పష్టం చేశారు.