Pocharam Srinivas Reddy: “అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా”.. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్

Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy: ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయం దురుద్దేశ్యం లేదని.. బుద్ధిహీనులు నాకు స్వార్ధం ఉందని మాట్లాడుతున్నారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గురువారం కామారెడ్డి జిల్లా వర్ని మండలంలో పర్యటించి, జాకోరా గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తనకు స్వార్థం ఉందని నిరూపిస్తే రాజకీయాలు వదులుకుంటానన్నారు. “నా మాటల వెనుక రాజకీయం, రహస్యం లేదు. నేను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. నాకు ఎలాంటి స్వార్థం లేదు. ప్రజల కోసమే నా జీవితం. అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రికి మద్దతు తెలిపాను. అన్నం పెట్టిన వాళ్లను మర్చిపోతే పుట్టగతులుండవు. కేసీఆర్ చేసిండు కాబట్టే చేసిండు అని చెప్పాను. రేవంత్ రెడ్డి ఇచ్చినవి కూడా చెబుతాను. ఉన్నది ఉన్నట్లు చెప్పడం నా నైజం. పోరాటం చేస్తా తప్ప, తల వంచే రాజకీయం చేయను. నా ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమైనా చేస్తాను. ఎమ్మెల్యేకు ప్రభుత్వ సహకారం కావాలి. ప్రభుత్వ సహకారం లేకుంటే ఏమి చేయలేం.” అని వ్యాఖ్యానించారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌ వద్దకు వెళ్లి కండువా కప్పుకొన్నట్లు ఇటీవల మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆరు నెలల్లో పెండింగ్‌ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని.. సగం నిధులు మాత్రమే ఇచ్చారన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూరులో కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పోచారం ఈ వ్యాఖ్యలు చేశారు. బిల్లులు పెండింగ్‌లో ఉండటం వల్ల గుత్తేదారులు పనులు ఆపేశారని.. నవంబర్‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ నిర్వహించారమన్నారు. ఆ సమావేశంలో సీఎం రేవంత్‌ను సూటిగా ప్రశ్నించినట్లు తెలిపారు. సీఎం చెప్పినట్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి నిధులు మంజూరు చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. ఈ వ్యాక్యలపై ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. దీంతో మరోసారి ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.