నేడు ఒడిశాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు. ప్రధాని మోడీ మధ్యాహ్నం ఝార్సుగూడ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2:15 గంటలకు సంబల్పూర్ కు ఆయన వెళ్తారు. ఈ సందర్భంగా జగదీష్పూర్-హల్దియా, బొకారో-ధమ్రా పైప్లైన్ ప్రాజెక్ట్ (జెహెచ్బీడీపీఎల్)లోని 412 కిలోమీటర్ల పొడవైన ధమ్రా అంగుల్ పైప్లైన్ సెక్షన్ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ప్రధాన మంత్రి ఊర్జా గంగ కింద 2,450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఒడిశాను జాతీయ గ్యాస్ గ్రిడ్తో అనుసంధానిస్తుంది.
Read Also: TATA : గరిష్ట స్థాయికి చేరుకున్న టాటా కంపెనీ.. మూడు నెలల్లో రూ.7,025 కోట్లు ఆర్జించింది
ఇక, అదేవిధంగా ముంబై-నాగ్పూర్-ఝార్సుగూడ పైప్లైన్ ప్రాజెక్ట్లోని నాగ్పూర్-జార్సుగూడ సహజ వాయువు పైప్లైన్ సెక్షన్కు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు 2,660 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు కానుంది. దీంతో ఒడిశా- మహారాష్ట్ర- ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో సహజవాయువు లభ్యత మెరుగుపడుతుంది. అలాగే దాదాపు 28,980 కోట్ల రూపాయల విలువైన పలు విద్యుత్ ప్రాజెక్టులకు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక, ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు.