NTV Telugu Site icon

Pawan Kalyan Tirupati Tour: తిరుపతి నేతలతో అర్థరాత్రి వరకు జనసేనాని చర్చలు.. ఒక్కతాటిపైకి వచ్చేశారు..

Tpt

Tpt

Pawan Kalyan Tirupati Tour: తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వం చిచ్చు పెట్టింది.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆరణి.. జనసేన పార్టీలో చేరి టికెట్‌ దక్కించుకున్నారు.. అయితే, స్థానికంగా ఉన్న జనసేన ఇంఛార్జ్‌ కిరణ్‌ రాయల్‌, జనసేన నేతలు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నేతలకు ఈ వ్యవహారం మింగుడుపడలేదు.. అభ్యర్థిని మార్చాలంటూ ఆందోళనకు దిగారు.. బహిరంగంగా పార్టీపై సంచనల వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ, జనసేన అధిష్టానం నుంచి వారిని సముదాయించే ప్రయత్నాలు జరిగాయి.. దీంతో, కొంత సైలెంట్‌ అయినా.. వారిలో అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయింది.. అయితే, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనతో అంతా ఒక్కతాటిపైకి వచ్చేశారు.

శుక్రవారం రోజు తిరుపతి వెళ్లిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. అర్ధరాత్రి వరుకు తిరుపతిలో కూటమీ పార్టీల నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించారు.. తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీని పంపించేయాలని పిలుపునిచ్చిన ఆయన.. జనసేన, టీడీపీ సమన్వయంతో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని సూచించారు. ఏ ఒక్క నాయకుడు.. కార్యకర్త త్యాగాన్నీ, కష్టాన్నీ మరచిపోం.. వచ్చేది కూటమి ప్రభుత్వమే.. నాయకులు, కార్యకర్తల బాధ్యతను సమష్టిగా తీసుకుంటాం అనే పార్టీ నేతలకు భరోసా కల్పించారు పవన్‌ కల్యాణ్‌.

ఇక, ఈ సందర్భంగా జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జ్‌ కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. 40 నిమిషాల పాటు పవన్ కల్యాణ్‌తో సుదీర్ఘంగా చర్చించాను.. కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుకు సహకరించమని కోరారు.. రేపటి నుంచే ఆరణితో కలిసి ప్రచారం నిర్వహిస్తాను అని స్పష్టం చేశారు. వైసీపీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడిస్తానని జనసేనానికి చెప్పా.. ఆరణిని భారీ మెజారిటీతో గెలిపిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. నీ భవిష్యత్తు నేను చూసుకుంటానని పవన్ కల్యాణ్‌ హామీ ఇచ్చారని.. పవన్ హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు కిరణ్‌ రాయల్‌.

మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సుగుణమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి అభ్యర్థుల విజయం అవసరం.. రాక్షస పాలనను తరిమికొట్టాలని పవన్ కల్యాణ్‌ సూచించారని తెలిపారు. ఇక, ఆరణిని శ్రీనివాసులును తిరుపతి ఎమ్మెల్యే గా గెలిపించుకుంటాం.. శ్రీనివాసులు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను తయారు చేసింది నేనే అన్నారు. నిరంతరాయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను.. అందరం కలిసి ఉన్నామని పవన్ కల్యాణ్‌కు చెప్పా.. పవన్ మాటలు ధైర్యాన్నిచ్చాయని తెలిపారు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. ఇక, రెండో రోజు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటన తిరుపతిలో కొనసాగుతోంది.. ఈ రోజు బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు పవన్‌.. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తోన్న విషయం విదితమే.