జాతీయ ఉపాధి హామీ పథకంపై తాను ప్రత్యేక దృష్టి పెట్టానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతిని గుర్తించామని, రూ.250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, అవినీతి కి పాల్పడ్డ కొంతమందిని సస్పెండ్ చేశామన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతిపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం సమాధానాలు ఇచ్చారు.
‘గత ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగింది. మేం అధికారంలోకి రాగానే ప్రత్యేక దృష్టి పెట్టాం. ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ డైరెక్టరే అవినీతికి పాల్పడ్డాడు. అందుకే మేం అధికారంలోకి రాగానే అతడిని పక్కన పెట్టాం. సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్లో కొత్త అధికారులను నియమించాం. ఉపాధి హామీ పథకంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. అవినీతికి పాల్పడ్డ కొంతమందిని సస్పెండ్ చేసాము. దుర్వినియోగం అయిన కొంత సొమ్ము రికవరీ చేశాం. ఉపాధి హామీ పథకంపై నేను ప్రత్యేక దృష్టి పెట్టాను’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.
‘గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. రూ.250 కోట్ల అవినీతి జాతీయ ఉపాధి హామీ పథకంలో జరిగింది. సాక్షాధారాలు లేక కేవలం రూ.74 కోట్లు మాత్రమే రికవరీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.71 లక్షలు రికవరీ చేసాము. సంబంధిత అధికారులపై చర్యలు తీస్కుంటున్నాము. జాతీయ ఉపాధి హామీలో సభ్యులు అడిగినట్టు వెజెస్ పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీస్కోవాలి’ అని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.