pawan kalyan made sensational Comments on bjp
అమరావతిలో జనసేన కార్యాలయంలో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాకుండా.. బీజేపీతో సంబంధాలపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ్టీ నుంచి రాష్ట్ర ముఖ చిత్రం మారుతోందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన లాంటి పార్టీ బీజేపీని రోడ్ మ్యాప్ అడగమేంటని విమర్శలు వచ్చాయని, ఎందుకో బీజేపీతో పొత్తు ఉన్నా..పూర్తి స్థాయిలో కలిసి వెళ్లలేకపోతున్నామన్నారు. ఈ విషయం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తెలుసనని, ప్రధాని, బీజేపీ నాయకత్వం అంటే నాకు గౌరవమే.. అలాగని ఊడిగం చేయలేమని వ్యాఖ్యానించారు. మా భారతమ్మను తిట్టేస్తున్నారని వైసీపీ నేతలు తెగ బాధపడిపోతున్నారని, నా తల్లి అంజనమ్మని ఎలా విమర్శించార్రా..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గుండాగాళ్లు పద్దతిగా మాట్లాడితే పద్దతే.. లేకుంటే చెప్పుతో కొడదామని, ప్రతి ఒక్కరూ డిబేట్సుకు వెళ్లండి.. ఏమైనా తేడాగా మాట్లాడితే పబ్లిక్గా బాదేయండంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తుంటే విశాఖ వాళ్లకు ఎందుకు కోపం రావడం లేదని, కార్మికుల్లారా..! మీరు కదలిరండి.. నేను నిలబడతానని ఆయన పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా నేను అడ్డంగా నిలబడతా.. అవసరమైతే ప్రాణాలిస్తానని, పటేల్ తర్వాత అత్యంత బలమైన అమిత్ షా తో నేను ప్రైవేట్ స్టీవ్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని మాట్లాడానన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటుకు గనులు ఎందుకు కేటాయించరు..?జిందాల్ స్టీలుకు ప్రైవేట్ గనులు ఉండగా లేనిది విశాఖ స్టీల్ ప్లాంటుకి ఎందుకు ఉండకూడదు. ఉత్తరాంధ్ర గురించి వైసీపీ సన్నాసులకేం తెలుసు. ఈ నేల మీద నాకు ప్రేమ ఉంది. కోనసీమలో వాళ్ల మంత్రి ఇల్లు వాళ్లే తగలెట్టేసి.. చిచ్చు పెట్టే ప్రయత్నం చేసింది వైసీపీ. పోలీసులంటే మాకు కోపం లేదు.. గౌరవం. రేపు పోలీసులు మా గొడుగు కిందే పని చేయాలని ఆయన అన్నారు.