Pawan Kalyan: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరకూడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గోదావరి జిల్లాల నుంచే వారాహి యాత్ర చేపట్టిన పవన్.. ప్రతీ సమావేశం, ప్రతీ మీటింగ్, ప్రతి బహిరంగసభలో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు.. ఏ నియోజకవర్గానికి వెళ్తే.. అక్కడి స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించడంతో పాటు.. సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు, నేతలను ఎవ్వరినీ వదలడంలేదు.. అయితే, ఈ రోజ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు 150 మంది వివిధ పార్టీలు చెందిన నాయకులు, కార్యకర్తలు.. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.. రాజకీయాల్లోకి సమర్థత ఉన్నవాళ్లు మరింతమంది రావాలని నా ఆకాంక్షగా పేర్కొన్న ఆయన.. నేరస్థులను ఎదుర్కోవాలంటే చట్టాలపై అవగాహన ఉన్నవాళ్లు కావాలన్నారు.. ఇక, వచ్చే నెల 5, 6 తేదీల్లో రాజమండ్రిలో జనసేన పార్టీ సమావేశం నిర్వహిస్తాం అని వెల్లడించారు.. అయితే, రాబోయే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరకూడదు అంతే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్.
కాగా, వారాహి యాత్రలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ రోజు భీమవరం అంబేద్కర్ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.. సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ సెంటర్లో నిర్వహించనున్న బహిరంగ సభ ప్రసంగించనున్నారు.. ఇక, అనంతరం భీమవరం నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్లనున్నారు.. మరోవైపు.. 6వ తేదీ తర్వాత తిరిగి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర ప్రారంభం అవుతుందని జనసేన పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మొత్తంగా.. వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఓవైపు.. జనసేనాని వ్యాఖ్యలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న కౌంటర్ ఎటాక్ మరోవైపుతో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ నడుస్తోంది. మరోవైపు, భీమవరం బహిరంగ సభలో పవన్ కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. మరోసారి భీమవరం నుంచి తాను పోటీ చేసే విషయంపై ఈ రోజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.