Team India: టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భాగంగా నేడు టీమిండియా ఇంగ్లాండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు భారత జట్టుకు సంబంధించి ఓ కీలక అంశాన్ని భారత మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ పార్థివ్ పటేల్ ప్రస్తావించారు. గత నాలుగు మ్యాచ్లలో టీమిండియా అద్భుత ప్రదర్శన ఇచ్చినప్పటికీ.. క్యాచింగ్లో మాత్రం చాలా డల్గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు 13 క్యాచ్లు మిస్ చేసింది. దీంతో టీమిండియా క్యాచింగ్ సామర్థ్యం కనిష్ట స్థాయికి (72.7%) పడిపోయింది. మరోవైపు ఫీల్డింగ్ విషయంలో తరచూ విమర్శలు ఎదుర్కొనే పాకిస్థాన్ జట్టు ఈ విషయంలో మెరుగ్గా నిలిచింది. 83.3 శాతం క్యాచింగ్ సక్సెస్తో భారత్ కంటే ముందుంది. ఈ అంశంపై ప్రస్తుతం భారత్ ఫీల్డింగ్లో ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయని పార్థివ్ పటేల్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై జట్టు తప్పకుండా దృష్టి పెట్టాలని సూచించారు.
READ MORE: Tollywood: బాలీవుడ్ కోసం టాలీవుడ్ హిట్లను వదులుకుంటున్న భామలు!
అయితే వెస్టిండీస్పై సాధించిన విజయం భారత్కు భారీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని పార్థివ్ అభిప్రాయపడ్డారు. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఆ మ్యాచ్లో వెస్టిండీస్ భారీ స్కోరు చేసినప్పటికీ భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. దాదాపు రెండు వందలకు చేరువైన లక్ష్యాన్ని ఛేదించడం సాధారణ విషయం కాదని, అలాంటి సమయంలో ఎవరో ఒకరు అసాధారణంగా ఆడాల్సిందేనని పార్థివ్ చెప్పారు. ఆ మ్యాచ్లో సంజు శాంసన్ ఆ బాధ్యతను అద్భుతంగా నిర్వర్తించారని ప్రశంసించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే ఎన్నో శతకాలు చూసినప్పటికీ, ఆ ఇన్నింగ్స్ ప్రత్యేకమని పార్థివ్ అభిప్రాయపడ్డారు. ప్రతిభ విషయంలో సంజు ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలుసు. కానీ మానసిక ఒత్తిడిని ఎదుర్కొని స్థిరంగా ఆడటం అంత సులభం కాదని అన్నారు. ఆ మ్యాచ్లో సంజు చాలా ప్రశాంతంగా, నియంత్రణతో ఆడాడని చెప్పారు. బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నించకుండా పరిస్థితిని అర్థం చేసుకుని బాధ్యతగా ఇన్నింగ్స్ను నిర్మించాడని వివరించారు. ఆ ఇన్నింగ్స్ను సంజు చాలా కాలం గుర్తుంచుకుంటాడని పార్థివ్ అన్నారు. ఇదిలా ఉండగా.. నేటి మ్యాచ్లో టీమిండియా బ్యాటర్స్ ఎవ్వరూ ఒత్తిడికి లోనవ్వద్దు. ఫీల్డింగ్ విషయంలో మెరుగ్గా ఉండాలి. లేదంటే.. మిస్ ఫీల్డ్, క్యాచ్లు చేజారుస్తే మ్యాచ్ చేజారే ప్రమాదం ఉంది. ఇంత దూరం వచ్చి ఇంటికి పయనయ్యే అవకాశం ఉంటుంది.