వైసీపీ నాయకుల అరెస్ట్ సిరీస్ మళ్ళీ మొదలైందా? నెక్స్ట్ టార్గెట్ ఎవరు? నటుడు పోసాని అరెస్ట్ వైసీపీ నేతల్ని టెన్షన్ పెడుతోందా? అసలా పార్టీలో ఇప్పుడు ఎలాంటి చర్చ జరుగుతోంది? వంశీ తర్వాత కొడాలి అన్న ప్రచారం జరిగినా… అనూహ్యంగా పోసాని వైపు ఎందుకు తిరిగింది? ఫ్యాన్ పార్టీ లీడర్స్ అరెస్ట్లకు మానసికంగా సిద్ధమవుతున్నారా? లెట్స్ వాచ్. టార్గెట్ లిస్ట్లో ఉండాలేగానీ… వైసీపీలో ఉంటే ఏంటి?.. బయట ఉంటే ఏంటి? ఇదీ…ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత ఈ తరహా చర్చలు ఎక్కువ అయ్యాయట. వైసీపీ హయాంలో ఆ పార్టీకి వాయిస్లా మారిన పోసాని…. నేరుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల మీదే విమర్శనాస్త్రాలు సంధించారు. కొన్ని సందర్భాల్లో మాట తూలడం, పరిధి దాటడం లాంటివి కూడా జరిగాయని, వాటి పర్యవసానమే… ఈ అరెస్ట్ అన్నది తాజా చర్చ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్ లాంటి వాళ్ళ అరెస్ట్లు జరిగాయి. వాళ్ల జైలు, బెయిల్ లాంటి ఎపిసోడ్స్ ముగిశాక… కాస్త సద్దుమణిగిందని అనుకుంటున్న టైంలో… మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో మరోసారి టాపిక్ స్టార్ట్ అయ్యింది. వంశీ, కొడాలి నాని ఇద్దరూ మంచి స్నేహితులు. వంశీని వైసీపీకి దగ్గర చేసింది కూడా నానినే అంటారు. వంశీతో పాటు నాని కూడా కూటమి నేతలపై అదే రేంజ్ లో విమర్శలు చేశారు. దీంతో నెక్స్ట్ అరెస్ట్ కొడాలి నానిదే ఉండవచ్చనే ప్రచారం జోరుగా జరిగింది. అందుకు ఆయన కూడా చేసుకుంటే చేసుకోనివ్వండబ్బా.. ఎన్నాళ్లు దాక్కుంటాం.. నాలుగు రోజులు లోపలుండి.. ఆ తర్వాత బయటకు వస్తాం అంటూ… తాపీగానే సమాధానం చెప్పారు.
దాంతో ఇంకేముంది నాని అరెస్టే తరువాయి అనుకుంటున్న టైంలో…ఎవ్వరూ ఊహించని విధంగా సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు కావటం సంచలనమైంది. వైసీపీ హయాంలో పోసాని చేసిన విచ్చలవిడి వ్యాఖ్యలపై కూటమి నేతల ఫిర్యాదుతో సీఐడీ కేసు బుక్ చేసింది. బాపట్ల, అనంతపురం, నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి, పుత్తూరు… ఇలా చాలా ప్రాంతాల్లో పోసాని మీద కేసులు పెట్టారు. వాటి పర్యవసానమే ఈ అరెస్ట్ అంటున్నారు. వైసీపీ టైంలో యాక్టివ్గా ఉన్న పోసాని…కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇక తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఫుల్ టైమ్ సినిమాలకే పరిమితం అవుతానని కూడా ప్రకటించారు. కానీ… ఆయన్ని నాన్బెయిలబుల్ సెక్షన్స్ కింద అరెస్ట్ చేయడం సంచలనం అయింది. కులాల పేరుతో దూషించారని, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని కేసులు పెట్టారు. దీంతో నెక్స్ట్ ఎవరన్న చర్చ మరోసారి మొదలైంది.వంశీ తర్వాత కొడాలి నానినే అంటూ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరిగింది. కానీ… పోసాని లైన్ లోకి రావటంతో… మరోసారి తిరిగి అందరి దృష్టి కొడాలి వైపునకు మళ్ళుతోందట. ఇప్పుడు మళ్ళీ నెక్ట్స్ టార్గెట్ కొడాలి నానినే అంటూ సోషల్ మీడియా పోస్ట్లు పెరిగిపోతున్నాయి. అయితే పోసాని అరెస్టుపై వైసీపీ నేతలు వేగంగానే స్పందించారు. అరెస్టు నోటీసులో ఒకరోజు డేట్ తప్పుగా వేయటాన్ని తప్పుపడుతున్నారట. దాని ఆధారంగా పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులు. న్యాయపరమైన వెసులుబాటు రానీయకుండా రెండు చోట్ల నుంచి కేసులను డ్రైవ్ చేస్తున్నట్టుగా అనుమానిస్తున్నారట. అదంతా ఒక ఎత్తయితే.. ఇప్పుడీ అరెస్ట్ల మీద వైసీపీ విశ్లేషణ వేరుగా ఉందట. ఇటీవల జగన్ 2.0 అంటూ కామెంట్స్ చేయటం పార్టీ కేడర్లో జోష్ నింపిందని, భారీగా క్యాడర్ రీ ఛార్జ్ మోడ్లోకి రావడంతో…వాళ్ళని భయపెట్టేందుకే…మళ్లీ అరెస్టులు మొదలయ్యాయన్నది వైసీపీ వెర్షన్గా తెలుస్తోంది. ఓటమి తర్వాత జగన్ మళ్ళీ జనంలోకి వస్తున్న క్రమంలో, ఓ వైపు పార్టీ నుండి నాయకుల వలసలు, మరోవైపు కీలక నేతల అరెస్టులు సాగితే… బూస్టప్ కి మరికొన్నాళ్లు టైం పట్టవచ్చన్న అంచనాతోనే ప్రభుత్వం మళ్లీ అరెస్ట్ల పర్వాన్ని మొదలుపెట్టి ఉండవచ్చంటున్నారు వైసీపీ నాయకులు. ఏది ఏమైనా వాళ్లు అనుకున్నది చేస్తారు..మనం అన్నింటికి సిద్దంగా ఉండాల్సిందేనన్న క్లారిటీకి ఫ్యాన్ పార్టీ నాయకులు వచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు. మరి నెక్స్ట్ టార్గెట్ ఎవరు? అందుకు వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాలి మరి.