యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలక మండలి ఏర్పాటుకు ఎందుకు ముందడుగు పడటం లేదు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ….చట్ట సవరణ చేశాక కూడా… ఎక్కడ తేడా కొడుతోంది? నెలల తరబడి కసరత్తులు జరుగుతున్నా…. పాలకమండలి ఎంపిక కొలిక్కి రాకపోవడానికి కారణాలేంటి? ప్రభుత్వ పెద్దలకు ఎలాంటి సవాళ్ళు ఎదురవుతున్నాయి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక… తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డ్ తరహాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కూడా బోర్డ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం దేవాదాయ శాఖ చట్టాన్ని సవరించింది. కొత్త చట్టం ప్రకారం యాదగిరిగుట్ట ఆయలయానికి బోర్డు ఏర్పాటు చేసేందుకు రూట్ క్లియరైంది. ఒక చైర్మన్, 11 మంది పాలక మండలి సభ్యులు, మరో 6 మంది ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 18 మందితో బోర్డ్ ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. అయినా…వ్యవహారం ఇంతవరకు కొలిక్కి రాలేదు. రెండు నెలలుగా తీవ్ర కసరత్తు జరుగుతున్నా…. ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారట ప్రభుత్వ పెద్దలు. సేవా గుణం ఉన్న పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు, వివిధ రంగాలలో నిష్ణాతులను సభ్యులుగా నియమించే అంశాన్ని పరిశీలిస్తోంది ప్రభుత్వం. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి కూడా బోర్డులో ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించింది. దీంతో జాతీయ స్థాయిలో యాదగిరిగుట్ట ఆలయ ప్రాచుర్యం పెరుగుతుందని ప్రభుత్వ ఆలోచన. అంతా బాగానే ఉన్నా…. కొత్త ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు మాత్రం జరగడంలేదు. చివరిసారిగా 2008లో ఏర్పాటైన నా ధర్మకర్తల మండలి 2010 వరకు కొనసాగింది. అప్పటినుండి 15 ఏళ్లుగా పాలక మండలి లేకుండానే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్వహణ కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ట్రస్ట్ బోర్డ్ ఆలోచనతో… చాలామంది కాంగ్రెస్ నాయకులు తమకు పదవులు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పదేళ్ళపాటు పార్టీని నమ్ముకొని ఉన్న నేతలు, అసెంబ్లీ టిక్కెట్స్ ఆశించి నిరాశగా ఉన్నవారు, ఎమ్మెల్యేలను గెలిపించేందుకు కష్టపడిన నేతలు… ఇలా రకరకాల కోటాల్లో ట్రస్ట్ బోర్డ్ పదవులు ఆశిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.
వీరితో పాటు వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యాదగిరిగుట్ట బోర్డు సభ్యులుగా, చైర్మన్ గా పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. వీరంతా… ఎవరికి వారుగా తమ సన్నిహిత నేతల ద్వారా దేవస్థానం బోర్డులో చోటు కోసం లాబీయింగ్ చేస్తున్నారట. ఎట్టిపరిస్థితుల్లో తమకు పాలక మండలి సభ్యుడి పదవి ఇప్పించాలంటూ ప్రభుత్వంలోని ముఖ్యుల మీద వత్తిళ్ళు తెస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సైతం పాలకమండలిలో సభ్యులు, ఛైర్మన్గా మా వాళ్ళే ఎక్కువగా ఉండాలని పట్టుదలకు పోతుండటంతో పీటముడి బిగుసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ప్రభుత్వ విప్, స్దానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య… ఇలా ఎవరికి వారే… బోర్డ్ ఛైర్మన్, సభ్యుల పదవుల కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారట. బలమైన, పరపతి ఉన్న నాయకులే పోటీ పడటం కారణంగా తుది నిర్ణయంలో జాప్యం జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఛైర్మన్ పదవి తన వర్గానికంటే తన వర్గానికే కావాలంటూ… ఇద్దరు మంత్రులు పట్టుదలకు పోవడంవల్ల ఎంపిక ప్రభుత్వానికి తలనొప్పిగా మారినట్టు ప్రచారం జరుగుతోంది. అసలు ఛైర్మన్ దగ్గరే ముడి బిగుసుకుపోవడంతో ఇక బోర్డ్ సభ్యుల విషయం మీద దృష్టి పెట్టే అవకాశం లేకుండా పోతోందని అంటున్నారు. ఇద్దరు కీలక నేతలను కాదనలేక.. బోర్డు ఏర్పాటుకు ముందడుగు వేయలేక… ముఖ్యమంత్రి కూడా తీవ్ర సందిగ్ధంలో ఉన్నట్టు సమాచారం. ఇది చాలదన్నట్టు రాష్ట్ర స్థాయిలో కీలక నామినేటేడ్ పదవులు ఆశిస్తున్న కొందరు నేతలు కూడా యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఛైర్మన్గా తమనే ఎంపిక చేయాలని వత్తిడి చేస్తున్నారట. ఇలాంటి రాజకీయ పరిస్థితుల నడుమ ఛైర్మన్ ఎంపిక ప్రభుత్వానికి సవాల్గా మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తంగా ఆశావాహులంతా…. విన్నపాలు వినవలె అంటూ… తమ ప్రియతమ నేతలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎలా ఉన్నా…. చివరికి ఆ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహుడి కరుణా కటాక్షాలు ఎవరికి మీదున్నాయో చూడాలి.