కాషాయదళం తెలంగాణలో దూకుడు పెంచాలనుకుంటోందా? అందుకు స్పెషల్ ప్లాన్స్ సిద్ధమవుతున్నాయా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే ముంది కింది నుంచి రావాలని పార్టీ ముఖ్యులు ఫిక్స్ అయ్యారా? అందుకు ఏం చేయాలనుకుంటున్నారు? ఆ కొత్త ప్లాన్ ఏంటి? తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జూన్లో జరగవచ్చన్నది కమలనాధుల అంచనా అట. అందుకే ఇప్పటి నుండే కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థలు బలపడాలంటే… బీజేపీ గెలవాలన్న నినాదంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నట్టు సమాచారం. గ్రామాలకు కేంద్ర నిధులు తప్ప బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నది కాషాయ పార్టీ మాట. అందుకే గ్రామాల్లోకి కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా తీసుకెళ్ళాలనినిర్ణయించింది. ఆ దిశగా.. తమకు అనుకూల వాతావరణాన్ని తీసుకురావడంతోపాటు, ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం కలిగించేందుకు బస్సు యాత్ర చేపట్టాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ యాత్రలో పార్టీ ముఖ్యనేతలంతా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. బస్సు యాత్రతో పాటు ఎన్నికల కోసం ZPTC స్థానాల వారీగా ఇన్చార్జ్లను నియమించాలని డిసైడ్ అయింది బీజేపీ. రాష్ట్ర స్థాయిలోనూ కమిటీ వేసి అందర్నీ సమన్వయం చేసుకోవాలనుకుంటున్నది ప్లాన్గా తెలిసింది. అంగ బలం, అర్థబలం ఉన్న వాళ్ళని ఎంపిక చేసి ఎన్నికల్లో కొట్లాడాలనే ఆలోచనతో ఉందట కాషాయ నాయకత్వం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవడానికి ఈ లోకల్బాడీస్ ఎలక్షన్స్ని మంచి అవకాశం అని భావిస్తున్నారట. వీటిలో సత్తాచాటి… కింది స్థాయిలో కూడా తమకు పట్టు ఉందని నిరూపించుకోవాలనుకుంటున్నారు కమలనాథులు.
స్థానిక సమస్యలతో పాటు పలు అంశాలపై ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే… సంస్థాగతంగా ఇంకా పెండింగ్ ఉన్న కమిటీలను పూర్తి స్థాయిలో వేసుకోవాలని నిర్ణయించింది అధినాయకత్వం. బస్సు యాత్ర పూర్తిగా రాష్ట్రంలోని గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలన్నిటినీ టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారట. కనీసం 70దాకా శాసనసభ నియోజక వర్గాల గుండా ఈ యాత్ర వెళ్ళాలన్నది పార్టీ పెద్దల ఆలోచన అట. ఏదో… బస్సు ఎక్కామా? దిగామా? అన్నట్టుగా కాకుండా… సీరియస్గా ఉండాలని, ఎవరో ఒక నేత కాకుండా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలంతూ బస్సులో ఉండేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా బీజేపీలో విభేదాలు లేవని, నాయకులంతా సమష్టిగా ముందుకు వెళ్తున్నారని ఇటు కేడర్కు, అటు ప్రజలకు సంకేతాలు పంపాలనుకుంటున్నట్టు సమాచారం.ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో బీజేపీ పట్ల విశ్వాసం మరింత పెరుగుతుందని… కేడర్లో కూడా ఉత్సాహం వస్తుందని…. పార్టీ అభిమానులు సంతృప్తి చెందుతారని భావిస్తున్నారట ఆ పార్టీ నేతలు. జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండొచ్చంటూ…కామెంట్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అందుకే త్వరలోనే బస్సు యాత్ర తేదీలు ఖరారవుతాయని, ఫుల్ పిక్చర్ వస్తుందని చెప్పుకుంటున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు.