ఏదైతే ఏముంది… కప్పేసుకోండి కండువాలు. అన్నీ మనవే, అంతా మనోళ్లే అంటున్నారు అక్కడ కూటమి లీడర్స్. ఆ నియోజకవర్గంలో కేడర్లేని బీజేపీకి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడంతో మంత్రసానితనం ఒప్పుకున్నాక తప్పుతుందా…అనుకుంటూ టీడీపీ కార్యకర్తలకే బీజేపీ కండువాలు వేసేస్తున్నారు. ఏదో ఒకటి కానిచ్చేయండని పై స్థాయిలో అంటున్నా… ఠాఠ్… ఆ కండువా మాకెందుని అంటోందట కేడర్. ఎక్కడుందా విచిత్రమైన పరిస్థితి? ఏంటా గోల? ఎన్డీఏ కూటమి పొత్తులో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. కానీ… అక్కడ ఆ పార్టీ జెండా మోసే కార్యకర్తలే కరవయ్యారట. జనసేన పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అన్నది లోకల్ వాయిస్. దీంతో ఇక చేసేదేం లేక…. టీడీపీ కార్యకర్తలే కొందరు బీజేపీ, మరి కొందరు జనసేన కండువాలు కప్పుకుని మేనేజ్ చేస్తున్నారట. ఇదంతా చూస్తున్నవారు మాత్రం ఔరా… ఏం రాజకీయం రా నాయనా… అంటూ ముక్కున వేలేసుకుంటున్నారట. ఇంత చేస్తున్నా… ఇక్కడ కూడా షరతులు వర్తిస్తాయి… అన్నట్టుగా ఉందట మేటర్. బద్వేల్లో కూటమి బ్రహ్మాండంగా ఉంది… మేమంతా ఒక్కటేనని పైకి చెప్పడానికి ఎంత ప్రయత్నిస్తున్నా… లోలోపల తేడాలు మాత్రం గట్టిగానే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ కేడర్లో కొందరు జనసేన జెండాలు మోయడానికి ఇష్టపడుతున్నా… బీజేపీని భుజాన వేసుకోవడానికి మాత్రం ససేమిరా అంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పోరు పడలేక కొన్ని చోట్ల కాషాయ పార్టీ జెండాలు మోయడానికి అరువు మనుషుల్ని తెచ్చుకుంటున్నారట. బద్వేల్ నియోజకవర్గంలో 2004 నుంచి ఇప్పటివరకు టిడిపి ఖాతా తెరవలేదు. 2009 వరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న బద్వేల్ తరువాత ఎస్సీ రిజర్వ్ డ్ అయింది.
2004 వరకు ఇది తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్నా… వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రాబల్యం పెరిగాక సీన్ మొత్తం మారిపోయింది. చివరికి స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇక్కడ టిడిపికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తమ పరిస్థితే అలా ఉన్నప్పుడు….. కేడర్ అంతగా లేని బీజేపీకి ఈ టిక్కెట్ ఎందుకు ఇచ్చారో అర్ధంగాక టీడీపీ కేడర్ బుర్ర గోక్కుంటున్న పరిస్థితి. 2004 నుంచి ఇక్కడ టీడీపీ ఎలాగూ గెలవలేదు కాబట్టి…ఈసారి కూడా అదేదో బీజేపీ ఖాతాలో తోసేస్తే ఓ పనైపోతుందని అనుకున్నారేమోనన్న వాదన సైతం బలంగా ఉంది. అయితే.. యువగళం తర్వాత బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితీష్ కుమార్ రెడ్డి నియోజవర్గం మొత్తం పాదయాత్ర చేసి కేడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన బొజ్జా రోషన్న కూడా అంతకు ముందు రితీష్ కుమార్ మద్దతుతోనే టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ముందు ఆయన్ని తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించడంతో… నియోజకవర్గం మొత్తం కలియదిరిగి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతలో హఠాత్తుగా తెర మీదికి బీజేపీ రావడంతో సీన్ మారిపోయింది. విజయమ్మ కుటుంబం నిరుత్సాహంలో పడిపోయిందట. నాలుగు దశాబ్దాలుగా బద్వేల్ టిడిపి లో విజయమ్మ కుటుంబానిదే హవా. ఆమె తండ్రి బిజవేముల వీరారెడ్డి టిడిపి ప్రభుత్వంలో ముడు సార్లు మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గం రిజర్వ్డ్ అయ్యాక కూడా తమ పట్టు తగ్గకుండా తాము సూచించిన వ్యక్తికే టిక్కెట్ వచ్చేలా జాగ్రత్తుల తీసుకుంటోందీ ఫ్యామిలీ. ఈసారి కూడా బొజ్జా రోషన్నకు అలాగే ఇప్పించుకున్నా… బీజేపీ తెర మీదికి వచ్చింది. దీంతో రోషన్నకే కండువా మార్చేసి కాషాయ అభ్యర్థిగా నిలబెట్టాల్సి వచ్చిందట. అంత వరకు బాగానే ఉన్నా… బీజేపీ అభ్యర్థిగా రోషన్న వెనక నడిచేవాళ్ళు ఎవరంటే మళ్లీ క్వశ్చన్ మార్కే. అందుకే విజయమ్మ తమ కుటుంబ మద్దతుదారులతో రహస్య సమావేశం నిర్వహించి మధ్యే మార్గంగా ఓ ప్లాన్ సూచించారట. మనోళ్ళే కొందరు బీజేపీ కండువాలు కప్పుకోమని సూచించడమే ఆ మధ్యే మార్గం. అందుకు కొందరు సమ్మతించినా… మరి కొందరు మాత్రం జనసేన కండువా అయినా వేసుకుంటాం గానీ.. బీజేపీ మాత్రం మా వల్ల కాదని అంటున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారం చూసి కాస్తో కూస్తో ఉన్న బీజేపీ లీడర్స్ హర్ట్ అవుతున్నారట. మొత్తానికి బద్వేల్ వ్యవహారం టీడీపీ, బీజేపీ నాయకత్వాలకు తలనొప్పిగా మారిందన్నది లోకల్ టాక్. మరి ఈ కండువాల గోల అక్కడితో ఆగుతుందా? లేక పోలింగ్ బూత్ దాకా క్యారీ అవుతుందా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.