Off The Record: ఎంపీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కక్కలేని మింగలేని పరిస్థితిలో ఉన్నారా? ఇటు కాషాయ దళంలో ఉండలేక.. అటు పార్టీ మారే విషయంలో డిసైడ్ అవలేక సతమతం అవుతున్నారా? అంటే అవుననే చెబుతున్నారు ఆయన సన్నిహితులు. చాలా రోజుల నుంచి పార్టీ వ్యవహారాలతో అంటీముట్టనట్టుగా ఉంటున్న రాజగోపాల్రెడ్డి… ముఖ్య కార్యక్రమాలకు సైతం దూరమవుతున్నారు. ఒకవేళ వచ్చినా… ముఖం చూపించి వెళ్తున్నారు తప్ప మనస్ఫూర్తిగా పాల్గొనడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. తెలంగాణ బీజేపీకి చెందిన కొందరు నేతలు ప్రత్యేక భేటీలు పెట్టుకున్నారు. ప్రత్యేక వర్గంగా ముద్రపడ్డ 10 మంది మాజీ ఎంపీలు మీటింగ్ పెట్టుకుని పార్టీలో తమ భవిష్యత్పై మాట్లాడుకున్నారు. ప్రాధాన్యత విషయమై అమిత్షాతో తాడో పేడో
తేల్చుకోవాలనుకున్నారు. అయితే… వాళ్ళంతా బీజేపీతో టచ్ లోనే ఉన్నారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఏదో ఒక రూపంలో అగ్ర నాయకత్వం దృష్టిలో పడ్డారు.
కానీ… ఒక్క కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాత్రం ఇంకా పార్టీ లైన్ లోకి వచ్చినట్టు కనిపించడం లేదట. మూడు రోజుల్లో మోడీ రెండు సార్లు తెలంగాణకి వచ్చినా అటు వైపే చూడలేదు రాజ్గోపాల్రెడ్డి. కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు. దీనిమీదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసమ్మతి నేతల భేటీకి హాజరైన నాయకుడు కీలకమైన ప్రధాని టూర్కు ముఖం చాటేయడం ఏంటన్న మాటలు వినిపిస్తున్నాయి. కోమటి రెడ్డి దారి ఎటు అని మాట్లాడుకుంటున్నారు పార్టీ నేతలు ఎక్కువ మంది. మునుగోడు ఉప ఎన్నిక తరవాత కూడా బీజేపీ కార్యక్రమాలకి పెద్దగా హాజరు అయింది లేదు ఆయన. ఈ మధ్య కాలంలో అయితే.. పూర్తి దూరంగా ఉంటున్నారు. బీజేపీ సభలకు కూడా హాజరు కావడం లేదు.
దీంతో రాజగోపాల్రెడ్డి పార్టీ మారతారని విస్తృత ప్రచారం జరుగుతోంది. అలాంటి ప్రచారాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయలేదాయన. ఎంపీ ప్రస్తుతం డోలయమాన స్థితిలో ఉన్నట్టు సమాచారం. పార్టీ మారాలా వద్దా అన్న సంగతి తేల్చుకోలేక ఊగిసలాట ధోరణిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సన్నిహితులు మాత్రం త్వరలోనే నిర్ణయం ఉంటుందని చెబుతున్నారట. ఎన్నికలకు ముందు పరిస్థితిని బట్టి నిర్ణయం ఉంటుందన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. దీంతో కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? వెళ్ళడమంటూ జరిగితే ఒక్కరే వెళ్తారా? లేక టీ బీజేపీని డ్యామేజ్ చేస్తారా అన్న చర్చ సైతం జరుగుతోంది. పరిణామాలు ఎలా మారతాయో చూడాలి.