Off The Record: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు విపక్ష హోదా ఇచ్చారు ఓటర్లు. 39 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండబోతోంది గులాబీ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు సీఎం హోదాలో శాసన సభాపక్ష నేతగా కూడా ఉన్నారు కేసీఆర్. మరి ఇప్పుడు… పరిస్థితులు తిరగబడ్డాయి. అధికారపక్షం సీట్లలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. విపక్షంలోకి బీఆర్ఎస్ వెళ్తోంది. అందుకే ఇప్పుడు ఆ పార్టీ తరపున ఎల్పీ నేతగా ఎవరు ఉంటారన్న చర్చ మొదలైంది. మామూలుగా అయితే.. దీని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి నేతృత్వం వహిస్తున్న నాయకుడిగా, ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆరే ఉంటారు. కానీ… ఆయన మనస్తత్వం గురించి తెలిసిన వారు మాత్రం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఆ సీట్లో కూర్చుంటారా? లేక కేటీఆర్కు గానీ, హరీష్రావుకు గాని ఆ బాధ్యతలు అప్పగిస్తారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట.
అదీ ఇదీ కాదని అసలు కుటుంబంతో సంబంధం లేని నాయకుడిని తెరమీదికి తెస్తారా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ఉద్యమ సమయంలో తప్ప మిగతా ఎప్పుడూ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో లేదు. రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి సీఎంగా ఉన్నారు కేసీఆర్. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుని అసెంబ్లీలో కాంగ్రెస్ను ఢీకొనడానికి ఇష్టపడతారా లేదా అన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. దానికి తోడు అధికార బలం ఉన్న కాంగ్రెస్ గతాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి సభలో దూకుడు ప్రదర్శించే అవకాశం ఉందంటున్నారు. ఆ వాతావరణంలో కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటారా? లేక సైడైపోయి వేరేవాళ్ళకి బాధ్యత ఇస్తారా అన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్ అంటున్నారు పరిశీలకులు.
2014-18 మధ్య తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్-రేవంత్రెడ్డి మధ్య మాటల తూటాలు పేలేవి. సభ ఎప్పుడూ హాట్ హాట్గానే జరిగేది. అందుకే ఈసారి ప్రతిపక్ష నేత పోస్ట్పై ఆసక్తి పెరుగుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ను కుటుంబ పార్టీ అంటూ టార్గెట్ చేశాయి బీజేపీ, కాంగ్రెస్. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ప్రతిపక్ష నేతగా కేటీఆర్ లేదా హరీష్రావుకు ఛాన్స్ ఇస్తే… ఆ పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ మరింతగా వాడుకునే అవకాశం ఉందన్న మరో వాదన సైతం ఉంది. అందుకే ఉంటే కేసీఆర్ లేదంటే… బీసీ లేక ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు పరిశీలకులు. కొత్త అసెంబ్లీ తొలి భేటీ జరిగేలోపు ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో ఇప్పుడు కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ పెరుగుతోంది.