హిందూ వారసత్వ చట్టం, ఆస్తి హక్కుల విషయంలో ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి సంపాదించిన ప్రతీ పైసా, ప్రతీ గజం స్థలం ఆటోమేటిక్ గా కొడుకుకు దక్కుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ.. చట్టం దృష్టిలో ‘వారసత్వ ఆస్తి’కి, ‘స్వార్జిత ఆస్తి’కి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇదే అంశంపై కేరళ హైకోర్టు తాజాగా ఒక సంచలన తీర్పును వెలువరించింది. తండ్రి కష్టార్జితంపై కొడుకుకు ఉండే హక్కుల విషయంలో న్యాయస్థానం కీలక స్పష్టత ఇచ్చింది.
కేరళ హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో అత్యంత ముఖ్యమైన విషయాన్ని చెప్పింది. తండ్రి తనంతట తానుగా.. సొంత కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిపై కొడుకుకు ఎటువంటి సహజసిద్ధమైన లేదా జన్మహక్కు ఉండదు. ఆ ఆస్తిని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అమ్మాలి లేదా ఎవరికి బహుమతిగా ఇవ్వాలి అనే పూర్తి అధికారం ఆ తండ్రికి మాత్రమే ఉంటుంది. తన ఆస్తిని కొడుకుకు ఇవ్వకుండా నిరాకరించే హక్కు కూడా తండ్రికి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
తాత ముత్తాతల నుంచి వారసత్వంగా తండ్రికి వచ్చిన ఆస్తిపై కొడుకులకు హక్కు ఉంటుంది. దీనిని వారు జన్మహక్కుగా క్లెయిమ్ చేయవచ్చు. స్వార్జిత ఆస్తి అంటే.. తండ్రి తన ఉద్యోగం, వ్యాపారం లేదా సొంత వనరులతో కొనుగోలు చేసిన ఆస్తి. దీనిపై తండ్రి బ్రతికి ఉన్నంత కాలం పిల్లలకు ఎటువంటి హక్కు ఉండదు. తండ్రి తన ఇష్టప్రకారం దీనిని ఎవరికైనా రాసివ్వవచ్చు.
Also Read:Hyderabad: పాతబస్తీలో అదృశ్యమైన యువకుడు.. బావిలో కుళ్లిపోయి ఇలా.. ఏం జరిగిందంటే..
కేరళలో ఒక వ్యక్తి తన తండ్రికి చెందిన 46 సెంట్ల భూమి విషయంలో కోర్టును ఆశ్రయించాడు. ఆ ఆస్తి తన తండ్రిది కాబట్టి అది తనకే చెందాలని, కానీ తన తల్లి ఆ ఆస్తిని మరో ఐదుగురు కుటుంబ సభ్యులకు పంచేలా వీలునామా రాసిందని అతను వాదించాడు. అయితే.. విచారణలో ఆ 46 సెంట్ల భూమి తండ్రికి వారసత్వంగా రాలేదని, ఆయన స్వయంగా సంపాదించిన ఆస్తి అని తేలింది.
దీంతో.. ఆ ఆస్తిపై కొడుకుకు ప్రత్యేక హక్కు లేదని కోర్టు తేల్చి చెప్పింది. తండ్రి తన స్వార్జిత ఆస్తిని తన భార్యకు (తల్లికి) బహుమతిగా ఇవ్వడం లేదా ఆమె ద్వారా ఇతరులకు వీలునామా రాయించడం చెల్లుబాటు అవుతుందని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో ఆస్తి పంపకాల విషయంలో తండ్రి నిర్ణయమే అంతిమమని మరోసారి రుజువైంది.