Elections 2024: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ కీలక ఘట్టం. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లన స్వీకరణ ప్రారంభం కానుంది. పార్లమెంట్ స్థానాలకు కలెక్టరేట్లల్లో, అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయం లోపలికి అనుమతి ఇస్తారు. నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపుతో పాటు దాఖలు చేసే ప్రాంతంలో పూర్తిగా వీడియో రికార్డింగ్ చేయనున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్కుల ఏర్పాటు చేశారు. నాలుగో దశలో ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే 10 రాష్ట్రాల్లోనూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే తేదీన తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఇదిలా ఉండగా ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Read Also: Lok sabha elections 2024: నాలుగో దశకు నేడు నోటిఫికేషన్
నాలుగోదశ నోటిఫికేషన్లో ఏపీ, తెలంగాణ, బీహార్, ఝూర్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు, ఏపీ బీహార్లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. వీటికి 25వ తేదీ నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 29వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో నామినేషన్ల ప్రక్రియ రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ప్రారంభ కానుంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వే లు నిలుపుదల చేయాల్సి ఉంది. ఎలాంటి సర్వేలు నేటి నుంచి వెల్లడించడానికి వీలులేదు. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముహూర్తాలు చూసుకుని నామినేషన్లను దాఖలు చేయడానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఇక నామినేషన్ల పర్వం నేటి నుంచి ప్రారంభం కానుంది.
నామినేషన్ల దాఖలు చేసేప్పుడు అభ్యర్ధులు తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు
*నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలి.
*అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్న నామినేషన్లను అనుమతిస్తారు.
*పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం-2ఏ, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం-2బి సమర్పించాలి,
*నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్లను స్వీకరణ
*ప్రభుత్వ సెలవు దినాలలో నామినేషన్ల స్వీకరణ ఉండదు.
*ఒక అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు.
* 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదు
*అభ్యర్థి నామినేషన్ వేసేటప్పుడు దరఖాస్తును పూర్తిగా పూరించారా లేదా సరి చూసుకోవాలి
*అఫిడవిట్ ప్రతి పేజీ పైన అభ్యర్థి విధిగా సంతకం చేయాలి
*పార్లమెంట్ నియోజకవర్గ పోటీకి జనరల్ అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్గా 25 వేల రూపాయలు
*అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కుల ధృవీకరణ పత్రం సమర్పిస్తూ 12,500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్లిస్తే సరిపోతుంది
*అసెంబ్లీ నియోజకవర్గ పోటీకి జనరల్ అభ్యర్థి 10 వేలు, ఎస్సి, ఎస్టీ అభ్యర్థులు 5వేలు డిపాజిట్ చేయాలి
*ఇటీవలే మూడు నెలల లోపల ఫోటో తీసుకున్నట్లుగా డెకరేషన్ ఇవ్వాలి,
*2x 2.5 సెంమీ సైజు మూడు కలర్ ఫొటోలు సమర్పించాలి
*ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు అయితే ఎలక్ట్రోల్ రోల్ సర్టిఫైడ్ కాపీని సమర్పించాలి,
*ఇంక్తో సంతకం చేసిన ఫారం ఏ , బీని రిటర్నింగ్ ఆఫీసర్ కి సమర్పించాలి,
*జిరాక్స్ కాపీలు అనుమతించడం జరగదు
*అభ్యర్థి ఎన్నికల వ్యయ పరిశీలన కొరకు నూతనంగా ఏదేని బ్యాంకు/కోఆపరేటీవ్ బ్యాంకు/పోస్టాఫీసు లో తన తెరిచిన ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాలి
*బ్యాలెట్ పేపర్ లో తన పేరు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఏ విధంగా ప్రచురించాలో తెలియజేయాలి
*ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే ఎంచుకున్న సింబల్ ను సూచించవలసి ఉంటుంది.
*నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల వృత్త పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించడం జరుగుతుంది.
*నామినేషన్ల దాఖలు చేసేప్పుడు అభ్యర్థితో కలిపి గరిష్టంగా 5 గురు వ్యక్తులకు మాత్రమే ఆర్ఓ ఆఫీస్లోకి అనుమతి
*నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అవగాహన కల్పించేందుకు పార్లమెంట్, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు
*అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పుటి నుంచి, ఎన్నికల ఖర్చు అతని ఖాతాలో లెక్కించడం జరుగుతుంది.
*పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ వార్తలకు అయ్యే ఖర్చును అభ్యర్థి ఖాతాలో లెక్కిస్తారు