Nitish Kumar Reddy: లార్డ్స్ మైదానంలో ప్రారంభమైన ఇంగ్లాండ్, భారత్ మూడో టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. మ్యాచ్ తొలి రోజు టీమిండియా పేసర్లు వికెట్లు తీయడంలో విఫలమైన తరుణంలో.. నితీశ్ ఒక్క ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్పై పట్టుసాధించాడు. ఇక మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు మంచి ఆరంభం లభించినప్పటికీ.. 14వ ఓవర్ బౌలింగ్కు వచ్చిన నితీశ్ రెడ్డి గేమ్ టర్నింగ్ ఓవర్గా నిలిచేలా చేశాడు. 14వ ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్ (23) రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగగా.. అదే ఓవర్ చివరి బంతికి జాక్ క్రాలీ (18) ను కూడా ఔట్ చేసి ఇంగ్లాండ్ జట్టుకు గట్టి షాక్ ఇచ్చాడు.
ఇది ఇలా ఉండగా.. మొదటి రోజు మ్యాచ్ అనంతరం మీడియాతో నితీశ్ మాట్లాడుతూ.. తన బౌలింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీడియాతో మాట్లాడిన ఆయన.. గత ఆస్ట్రేలియా పర్యటన అనంతరం నా బౌలింగ్ను మరింత మెరుగుపరచాలనే విషయం స్పష్టమైందని చెప్పుకొచ్చాడు. అలంటి సమయంలో ఐపీఎల్లో పాట్ కమిన్స్ నాయకత్వంలో ఆడినప్పుడు, బౌలింగ్ మెరుగుదలపై అతడిని పదేపదే అడిగేవాడినని.. అతను ఇచ్చిన సూచనలు నాకు చాలా ఉపయోగపడ్డాయని నితీశ్ తెలిపాడు.
Read Also:IMD Report: రైతులకు బ్యాడ్ న్యూస్.. అప్పటి వరకు వానలు లేనట్టే..?
అంతే కాకుండా.. భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ నుండి వచ్చిన సూచనలు కూడా తన ఆటలో మంచి మార్పు తీసుకువచ్చిందని పేర్కొన్నాడు. నితీష్ ఇంకా మాట్లాడుతూ.. ఆసీస్, ఇంగ్లాండ్ పిచ్లు ఒకేలా ఉన్నా, అప్పటి పరిస్థితులు, వాతావరణాన్ని బట్టి బౌలింగ్ను మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. మొత్తంగా కమిన్స్, మోర్కెల్ ఇచ్చిన సూచనలు నిజంగా మంచి ఫలితాలివ్వడంతో ఆనందంగా ఉందని నితీశ్ అభిప్రాయపడ్డాడు.