Narsapur Congress: అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్లపర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓవైపు.. స్వతంత్ర అభ్యర్థులు మరోవైపు భారీ ఏర్పాట్లతో రిటర్నింగ్ కార్యాలయాలకు చేరుకుని నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. నర్సాపూర్ కాంగ్రెస్లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు రెండు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచే ఇద్దరు నామపత్రాలు సమర్పించడం గమనార్హం. వాస్తవానికి ఆవుల రాజిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ ఇచ్చింది. అయినా తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ తరపున గాలి అనిల్ కుమార్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థి రాజిరెడ్డి కూడా నామినేషన్ వేశారు. పోటా పోటీగా భారీ ర్యాలీలు నిర్వహించి ఇద్దరు నేతలు నామినేషన్లు వేశారు.
Also Read: Komatireddy Rajagopal Reddy: నా లక్ష్యం కేసీఆర్ను గద్దె దింపడమే.. అది బీజేపీతో సాధ్యం కాలేదు..
మొదట్నుంచి కూడా టికెట్ తమకే దక్కుతుందని ఆశతో ఇద్దరు నేతలు తమ పనిని తాము చేసుకుంటూ.. క్యాడర్ను కూడగట్టుకుంటూ వెళ్తున్నారు. టిక్కెట్ తమకే వరించనుందని శ్రేణులకు భరోసా కల్పిస్తూ వచ్చారు. కార్యకర్తలు కూడా గ్రూపులుగా విడిపోయారు. ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆ పార్టీ అధిష్ఠానం ప్రయత్నిస్తున్న తరుణంలో పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు రచ్చకెక్కడంతో ఎన్నికల్లో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన అందరిలో నెలకొంది. ఈ తరుణంలో ఇద్దరూ నేతలు నామినేషన్లు సమర్పించడం గమనార్హం.
దీనిపై కాంగ్రెస్ అసమ్మతి నేత గాలి అనిల్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరపున తానూ నామినేషన్ వేశానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిందని.. నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిని మారుస్తారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అంటే ఆవుల రాజిరెడ్డి నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచినట్లు తెలిసింది.