తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోటాపోటీ సమావేశాలతో పార్టీలు రణరంగంలో దూసుకుపోతున్నాయి. బీజేపీ ప్రచారాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ లో నిర్వహించే ‘బీసీ ఆత్మగౌరవ సభ’లో ఆయన పాల్గొంటారు. మోడీ మంగళవారం సాయంత్రం 5.05 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 5.25 గంటలకు సభ జరిగే ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు.
సాయంత్రం 5.30 నుంచి 6.10 గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. సభ అనంతరం సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు అధికారిక షెడ్యూల్ విడుదల చేశాయి. ఇదిలావుండగా బీసీ ఆత్మగౌరవ సభను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో నేటి అసెంబ్లీలో ప్రధాని మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పలువురు బీసీ నేతలు హాజరుకానున్నారు.
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా మారిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా ప్రధాని మోడీ ప్రకటన చేసే అవకాశం ఉందని ఆ పార్టీకి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఎస్టీల రిజర్వేషన్లను 10–12 శాతానికి పెంచుతామన్న హామీ ఇవ్వొచ్చని భావిస్తున్నారు.