నల్లగొండ జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపిన ఘోర విషాదం చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని సాగర్ రోడ్డులో గల తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఒక ఇంట్లో నాలుగు మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
తెలంగాణ కాలనీలోని సదరు నివాసం నుండి గత కొంతసమయంగా తీవ్రమైన దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి పరిశీలించారు. అక్కడ నాలుగు మృతదేహాలు పూర్తిగా కుళ్ళిన స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో కలిసి పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాలు దాదాపు నాలుగు రోజుల క్రితమే కుళ్ళిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో లభించిన క్లూస్, ఇతర సాక్ష్యాధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.
హత్యా? ఆత్మహత్యా?..
ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పదంగా మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ అదే కుటుంబానికి చెందిన మరొక వ్యక్తి కనిపించడం లేదు. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయని, కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నామని నల్లగొండ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

