NTV Telugu Site icon

MP YS Avinash Reddy: చివరి నిమిషంలో సీబీఐ విచారణకు డుమ్మా.. పులివెందులకు అవినాష్‌రెడ్డి..

Mp Ys Avinash Reddy

Mp Ys Avinash Reddy

MP YS Avinash Reddy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతూనే ఉంది.. ఈ రోజు మరోసారి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి.. ఆయన హైదరాబాద్‌కు రావడంతో.. ఈ రోజు సీబీఐ ముందుకు వస్తారని భావించారు.. ఉదయం 11 గంటలకు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి రావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఆయన డుమ్మా కొట్టారు.. ఈ రోజు విచారణకు రాలేను అంటూ సీబీఐకి సమాచారం ఇచ్చిన ఆయన.. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది.. దీంతో విచారణకు రాలేకపోతున్నాను.. అని సమాచారం ఇచ్చి.. పులివెందులకు బయల్దేరి వెళ్లారు.. కాగా, పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి తల్లి.. ఆమె అనారోగ్యంతో ఆందోళనలో ఉన్న అవినాష్ రెడ్డి.. వెంటనే పులివెందులకు బయల్దేరారు.

Read Also: Honeymoon: హనీమూన్‌లో అశ్లీల వీడియోలు తీసి బెదిరింపు.. రూ.10 లక్షలిస్తేనే శోభనం

మరోవైపు.. గురువారం రోజు ఎంపీ అవినాష్‌రెడ్డి తరపు లాయర్లు సీబీఐ అధికారులను కలిశారు.. వెకేషన్‌ బెంచ్‌లో విచారణ వరకు అవకాశం ఇవ్వాలని కోరారు.. కానీ, దీనికి అంగీకరించలేదు సీబీఐ.. ఇక, ఈ రోజు విచారణకు హాజరు కాలేనంటూ కూడా ఎంపీ అవినాష్‌రెడ్డి.. సీబీఐకి సమాచారం ఇచ్చారు.. కానీ, సీబీఐ ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై స్పందించలేదు.. మరోసారి కడప ఎంపీని విచారణకు పిలుస్తారా? లేదా సీబీఐ మరేదైనా స్టెప్‌ తీసుకోనుందా? అనే చర్చ సాగుతోంది.. కాగా, ఈ రోజు ఉదయం 11 గంటల కంటే ముందు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయల్దేరారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. అప్పటికే పెద్ద ఎత్తున అవినాష్‌రెడ్డి అభిమానులు ఆయన ఇంటికి తరలివచ్చారు.. ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.. అంతా ఆయన సీబీఐ ఆఫీస్‌కే బయల్దేరి వెళ్తున్నారని భావించారు.. కానీ, ఆయన హైదరాబాద్‌ నుంచి నేరుగా పులివెందులకు బయల్దేరి వెళ్లారు. మరోవైపు, సీబీఐ కార్యాలయం నుంచి రెండు టీమ్‌లు బయల్దేరి వెళ్లాయి.. ఒక టీమ్‌ సీబీఐ కోర్టుకు వెళ్లగా.. మరో టీమ్‌ ఎక్కడికి వెళ్లిందనేది క్లారిటీ లేదు. దీంతో.. వైఎస్‌ వివేకా హత్య కేసులో ఈ రోజు ఏదైనా కీలక పరిణామం చోటుచేసుకోనుందా? అనేది ఉత్కంఠగా మారింది.