లోక్ సభ ఎన్నికలకు అమిత్ షా శంఖారావం పూరించారన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.., బీఅర్ఎస్ చిత్తుగా ఓడటం వల్లే కాంగ్రెస్ గెలిచిందన్నారు. ఒక్క ఎమ్మెల్యే నుంచి 8మంది ఎమ్మెల్యే లు గెలవడంతో అసలు విజయం బీజేపీదేనని ఆయన వ్యాఖ్యానించారు. బీఅర్ఎస్, కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలు విసిగి పోయారని, అందుకే ఇది కాంగ్రెస్ గెలుపు కాదన్నారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకొని రాష్ట్రానికి అప్పులు పెంచిందని ఆయన ఆరోపించారు.
బీఅర్ఎస్ నాయకుల సంపద పెంచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. లోపాలు సరిదిద్దుకుని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతామని ఆయన అన్నారు. తెలంగాణలో బీఅర్ఎస్ మునిపోయిన పడవ.. కాంగ్రెస్ మునగబోయే పడవ .. కమలం మాత్రమే వికసిస్తుంది అని అమిత్ షా భరోసా ఇచ్చారన్నారు. రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారని, అబద్ధపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ దాన్ని నిలబెట్టుకోలేక పోయిందన్నారు. స్థానిక అంశాలకు ప్రభావితమై అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేశారని ఆయన వ్యాఖ్యానించారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి పట్టం కట్టనున్నారని ఆయన వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయన్నారు.