Minister Uttamkumar Reddy: బీజేపీ మత రాజకీయాలు తప్ప రాష్ట్రాభివృద్ధికి చేసింది శూన్యమని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. జనరేటర్తో ప్రెస్ మీట్లు పెట్టుకొని కరెంటు కట్ అయింది అంటూ కేసీఆర్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంపై కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.
Read Also: KTR: ముఖ్యమంత్రి గుంపుమేస్త్రీ, ప్రధాని మంత్రి తాపీ మేస్త్రీ
అసలు కరువు మొదలైంది టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనేని.. కృష్ణా, గోదావరి జలాశయాల్లో నిల్వలు తక్కువగా ఉండటానికి కారణం కేసీఆర్ ధోరణి మాత్రమేనన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం సేకరణ కోసం 7149 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధిస్తుందని మంత్రి చెప్పుకొచ్చారు. దేశంలో బీజేపీని ఓడిస్తేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో కేటీఆర్ ఉచిత సలహాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేవని, కాంగ్రెస్ పార్టీలోనే నిష్ణాతులైన నాయకులు ఉన్నారని అన్నారు. 6వ తేదీన తుక్కుగూడలో జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు.