Jupally Krishna Rao: రాష్ట్ర అప్పులపై తాను ఇంతకు ముందు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడడం కాదు.. స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. తాను ఆత్మగౌరవం కోసం పని చేస్తానని.. తన ఉద్యోగాన్ని సైతం వదిలేసుకున్నానన్నారు. రాజకీయాలకు వచ్చింది మీలాగా అడ్డగోలుగా మాట్లాడటం కోసం కాదని మండిపడ్డారు. మిమ్మల్ని గౌరవంగా సంబోధిస్తున్నా.. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. హరీష్, కేటీఆర్, కేసీఆర్లు సోమాజిగూడకి రావాలని కోరారు. తాను తప్పు చెప్తె రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. మీరేం చేస్తారో చెప్పి సోమాజిగూడకి రావాలని డిమాండ్ చేశారు. పౌరుషం ఎవరికి ఉన్నదో తెలుస్తుందని.. పాలమూరు పౌరుషమా..? కల్వకుంట్ల పౌరుషమా అనేది తెలుస్తుంది కదా..? అని మంత్రి ఫైర్ అయ్యారు.
బావ బామ్మర్దులు తాను పారిపోయిన అని అంటున్నారని.. సిగ్గు శరం అని మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి చెప్పారు. “నేను నా మాటకు కట్టుబడి ఉన్నా. ఇప్పుడు కూడా పౌరుషం ఉన్నట్టు మాట్లాడి.. అసలు విషయం దాట వేస్తున్నారు. ఆపరేషన్ సక్సెస్, పేషంట్ డెడ్ అన్నట్టు ఉంది కేటీఆర్, హరీష్ తీరు. అసెంబ్లీలో కేటీఆర్, మేం చేసిన అప్పులు రూ. 3 లక్షల 17 అన్నారు. అదే కేటీఆర్ ఇంకోసారి రూ.3.85 వేల అప్పు అన్నారు. హరీష్ మాట్లాడుతూ
రూ. 4 లక్షల 26 వేల కోట్లు అని ఒకసారి, రూ. 4 లక్షల 17 వేల కోట్లు అప్పు అని ఇంకోసారి చెప్పారు. మీరు చెప్పింది రుజువు చేయండి. నేను చెప్పిన లెక్క తప్పు ఐతే.. నేను రాజీనామా చేస్తా. మీరు చెప్పింది అబద్దం ఐతే జవాబు రాత పూర్వకంగా చెప్పండి. మీరు చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నారా? నేను చెప్పిన రూ. 8 లక్షల 21 వేల కోట్లుకి కట్టుబడి ఉన్నా. కార్పొరేషన్లకు అప్పు తెచ్చింది ఎవరు? మీరు అప్పు తేకుంటే.. ప్రభుత్వం ఖజానా నుంచి ఎందుకు అప్పులు కట్టారు. కేసీఆర్ ఎలాగో అసెంబ్లీకి రావడం లేదు. పోనీ కేసీఆర్ను ఇవాళ మీడియా సమావేశం పెట్టి వివరణ ఇవ్వమనండి. నేను ఇవాళ కూడా సోమాజిగూడకి రావడానికి సిద్ధం. సమాధానం చెప్పాలి. మీరు రుజువు చేయలేకపోతే ఏం చేస్తారో కూడా చెప్పాలి. పార్టీని రద్దు చేసుకుంటాం అని చెప్పండి. సిగ్గుందా శరం ఉందా అంటున్నారు మిస్టర్ కేటీఆర్. పౌరుషం ఉంది కాబట్టే.. ఆ నాడు రాజీనామా చేశా. ఆనాడు రాజీనామా చేశాకే.. పాలమూరులో బీఆర్ఎస్కి ఏడు సీట్లు వచ్చాయి. నా చరిత్ర తెలుసుకోండి. సిగ్గు తప్పిన మాటలు మీరు మాట్లాడుతున్నారు.” అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ అంశంపై రాసిన ఓ బహిరంగ లేఖను కేటీఆర్కి వాట్సాప్ చేశారు.

