Ragidi Laxma Reddy: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో తనదైన శైలిలో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా రాగిడి లక్ష్మారెడ్డితో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత పాల్గొన్నారు. కంటోన్మెంట్ లీ ప్యాలెస్లో గార్వి వేడుకలతో పాటు సమావేశాన్ని మైనర్టీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి మల్లారెడ్డితో టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప ఎన్నికల ఇంచార్జి రావుల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్ధులను గెలిపించాలంటూ అతిధులు విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీలను కంటికి రెప్పలా కాపాడుకున్నామని.. వారికి అన్నింటా అవకాశాలు ఇవ్వడంతో పాటు ప్రతి పథకంలో భాగస్వాములు చేశామని ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కనీసం రంజాన్ తోఫాను అందించకపోగా.. ఇఫ్తార్ విందును సైతం అందించలేదని ఆయన విమర్శించారు. కారులో జోరు తగ్గలేదని తెలియజేయడానికి.. బీఆర్ఎస్ అభ్యర్ధులను భారీ మెజారిటీతో గెలిపించాలంటూ రాగిడి లక్ష్మారెడ్డి కోరారు.