NTV Telugu Site icon

Mahashivratri 2024: శివనామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు

Mahashivratri 2024

Mahashivratri 2024

Mahashivratri 2024: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. ఉదయం నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ రాజన్న ఆలయం, కీసర రామలింగేశ్వరస్వామి ఆలయం, కాళేశ్వరం, చెర్వుగట్టు లింగమంతుల ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. వరంగల్‌లోని ప్రసిద్ధ ఆలయమైన వేయిస్తంభాల గుడిలో పునర్మిర్మాణం చేసిన కళ్యాణమండపాన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రారంభించారు. కుటుంబ సమేతంగా వేయి స్తంభాల గుడిలో పూజలు చేశారు.

Read Also: Maha Shivratri 2024: శివరాత్రినాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు మీ సొంతం

మహా శివరాత్రి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో శైవక్షేత్రాలు భక్తులతో రద్దీగా మారాయి. అర్ధరాత్రి నుంచే మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వరంగల్ వేయిస్తంభాల ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నగరంలోని వేయి స్థంబాల దేవాలయం, సిద్దేశ్వరాలయం, కురవి శ్రీ వీరభద్రేశ్వరుడి ఆలయాలుభక్తులతో కిటికిటలాడుతున్నాయి. అయినవోలు మల్లికార్జున స్వామి ఆలయం, పాలకుర్తి సోమేశ్వరాలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ ఆలయాల్లో అభిషేకం చేసుకునేందుకు తెల్లవారుజామున నుంచి భక్తులు బారులు తీరారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాగారం, ఉపవాసం చేసే వారికొసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కూడా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు కాళేశ్వర ముక్తీశ్వరుని దర్శనానికి క్యూ కట్టారు. ఇతర జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ నుంచి భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి, గోదారి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేసి, మారేడు దళాలతో సమర్పిస్తున్నారు.

Read Also: Maha Shivratri : శివరాత్రి పూజా విధానం.. శుభ సమయం ఇదే

ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. పానగల్లులోని ఛాయా, పచ్చల సోమేశ్వర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకొని అభిషేకాలు చేస్తున్నారు. సూర్యాపేట పిల్లలమర్రి, మేళ్ల చెర్వు స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల ఆధ్యాత్మిక సందడి నెలకొంది. చెర్వుగట్టు పార్వతీజడల రామలింగేశ్వర స్వామి, వాడపల్లి ఆగస్తేశ్వర స్వామి దేవాలయాలల్లో భక్తులు భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహిస్తున్నారు భక్తుల కోసం ఆలయ కమిటీ సభ్యులు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. మంచి నీటి సౌకర్యం కల్పించారు.

ఖమ్మం జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. గుంటి మల్లన్న , తీర్థాల, కూసుమంచి, పెనుబల్లి, మధిర , భద్రాచలంలలో శివాలయాల్లో భక్తులు బారులు తీరారు.

అటు ఏపీలోనూ శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీశైలం మల్లన్న క్షేత్రం, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరస్వామి ఆలయం, మహానంది ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలంలో అర్థరాత్రి 2 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలివచ్చి ముక్కంటి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షిలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శివపార్వతుల కళ్యాణోత్సవం, రుద్ర హోమం, దీపోత్సవం నిర్వహించనున్నారు. పల్నాడులోని కోటప్పకొండ, అమరావతి, గుంటూరు జిల్లాలోని క్వారీ, గోవాడ తదితర ప్రాంతాల్లోని శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ నెలకొంది.

Read Also: Mahashivratri: మహామృత్యుంజయ్ మంత్ర కథ..శివరాత్రి నాడు శివునికి సంబంధించిన ఈ స్టోరీ తెలుసుకోండి?

రాజమండ్రిలో. గోదావరి స్థాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్, కోటిలింగాలు ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివాలయాల్లో తెల్లవారుజాము నుండి దర్శనాలు ప్రారంభమయ్యాయి.స్వామివారి దర్శనానికి ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. రాజమండ్రిలో కోటిలింగాలు ఘాట్ నుండి పుష్కర్ ఘాట్ మీదుగా గౌతమి ఘాట్ వరకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదావరి గట్టు రోడ్లో భక్తులు రద్దీ దృష్ట్యా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. స్నాన సమయంలో ఘట్టాల్లో. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పడవలతో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు.

దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. శైవాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు.. పరమేశ్వరున్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. కాశీ విశ్వనాథుని దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహంకాళ్ ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి వారికి అర్చకులు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ప్రయాగ్ రాజ్‌లో పుణ్యస్నానాలు చేసి నది ఒడ్డున దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు. గోరఖ్ పూర్‌లో జార్ఖండి మహాదేవ్ ఆలయంలో పరమేశ్వరున్ని మారేడు దళాలతో భక్తులు పూజిస్తున్నారు.