Megha Parmar: మేఘా పర్మార్.. మధ్యప్రదేశ్ నుండి మౌంట్ ఈవెంట్ శిఖరాన్ని చేరుకున్న మొదటి మహిళ. ఆమె పేరును ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమం, రాష్ట్ర డెయిరీ బ్రాండ్ సాంచి అంబాసిడర్గా తొలగించబడిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మే 9న చింద్వారాలో జరిగిన ఒక కార్యక్రమంలో మేఘా పర్మార్ కాంగ్రెస్లో చేరిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్లో చేరిన ఒక రోజు తర్వాత, బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమానికి రాష్ట్ర అంబాసిడర్గా ఉన్న మేఘాను మహిళా, శిశు అభివృద్ధి శాఖ రద్దు చేసింది. ఐదు రోజుల తర్వాత, మే 15న, రాష్ట్ర డెయిరీ బ్రాండ్ సాంచి అంబాసిడర్గా ఆమె పేరు కూడా తొలగించబడింది. ఈ పరిణామాన్ని అనుసరించి, కాంగ్రెస్లో చేరినందుకే మేఘాను అంబాసిడర్ పాత్ర నుండి తొలగించారని కాంగ్రెస్ ఆరోపిస్తూ బీజేపీపై విరుచుకుపడింది. దేశం గర్వించేలా చేసిన మేఘా పర్మార్ను కాంగ్రెస్లో చేరడమే ఏకైక నేరంగా ‘బేటీ బచావో, బేటీ పఢావో’ అంబాసిడర్గా తొలగించారని ఆ పార్టీ నాయకుడు కేకే మిశ్రా అన్నారు.
Read Also: Mukesh Ambani : అంబానీ లిఫ్ట్ చూశారా? డబుల్ బెడ్రూం అంత ఉంటుంది
అంబాసిడర్గా తన ప్రస్తుత బాధ్యత నుంచి వైదొలగడంపై మేఘా పర్మార్ మాట్లాడుతూ.. బీజేపీకి బేటీ బచావో బేటీ హటావోగా మారిందని మండిపడ్డారు. “నేను రైతు కూతురిని. ప్రపంచంలోని ఎత్తైన శిఖరాన్ని జయించడాన్ని నేను ఊహించలేకపోయాను. కమల్ నాథ్ నాకు చాలా సహాయం చేశారు. ఆయన నాకు ఆర్థిక సహాయం చేశారు. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని జయించగలిగాను. సినీ నటీమణులకు బదులు రైతు కూతురిని ‘బేటీ బచావో-బేటీ పఢావో’ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా చేశారు కమల్నాథ్. కానీ మహిళల గౌరవం గురించి పెద్దగా మాట్లాడే బీజేపీ ప్రభుత్వం అదే రైతు కూతురిని బ్రాండ్ అంబాసిడర్ నుంచి తప్పించింది” అని మేఘా పర్మార్ అన్నారు. “ఈ రోజు మహిళా సాధికారత గురించి బీజేపీ చేస్తున్న వాదనలు బట్టబయలయ్యాయి. శివరాజ్ ప్రభుత్వం చర్య నన్ను అవమానించడమే కాకుండా మహిళా సాధికారతను కించపరిచింది” అని ఆమె అన్నారు. కాగా, మేఘా పర్మార్, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. మే 22, 2019న, ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మధ్యప్రదేశ్కు చెందిన మొదటి మహిళగా మేఘ నిలిచింది.