అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానించినప్పటికి పార్టీకి కట్టుబడి ఉన్న నాయకులను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించేది లేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ స్పష్టం చేశారు. పాతవారిని పక్కన పెట్టి కొత్త వారికి సీట్లు ఇవ్వడం కాంగ్రెస్ ఆనవాయితీ కాదన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ తో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ లు సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు పార్టీని నమ్ముకుని ఉన్న వారికి సరైన ప్రాధాన్యత కల్పిస్తామని మధుయాష్కి అన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ల సీట్ల కేటాయింపు జరగలేదు అని ఆయన పేర్కొన్నారు. మైనంపల్లి హనుమంతరావుకి టికెట్ ఇస్తారని జరుగుతున్న ప్రచారం సరికాదని.. కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామని మధుయాష్కి గౌడ్ తెలిపారు.
Read Also: Thailand: చైనా పర్యాటకులను ఆకర్షించేందుకు థాయ్లాండ్ కొత్త వీసా రహిత విధానం
మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మల్కాజిగిరి ఎమ్మెల్యే సీటుకు సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని ఆయన అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, వి.హనుమంతరావు చర్చలు జరిపారని నందికంటి శ్రీధర్ తెలిపారు. మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావుకి టికెట్ కేటాయించే అంశంపై పార్టీ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పార్టీని నమ్ముకుని కష్టపడుతున్న వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కుటుంబానికి ఒకటే టికెట్ అనే ఉదయపూర్ డిక్లరేషన్ ఇక్కడ కూడా వర్తిస్తుందని నందికంటి శ్రీధర్ అన్నారు.