ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు కంచుకోటలైన రాయ్బరేలీ, అమేథీ స్థానాలకు ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించకపోవడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్కు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఈ రెండు స్థానాలకు శుక్రవారంతో నామినేషన్ గడువు ముగుస్తోంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి గురువారం సాయంత్రమే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అభ్యర్థులను ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ గత అర్ధరాత్రి వరకూ టెన్షన్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు.
ఇదిలా ఉంటే రాయ్బరేలీ నుంచి రాహుల్గాంధీ బరిలోకి దిగవచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తొలుత ఇక్కడ ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని అంతా ప్రచారం జరిగింది. కానీ.. చివరికి అమ్మ స్థానంలోకి కుమారుడే వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అమేథీ స్థానంలో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది.. గానీ చివరికి ఈ స్థానంలోకి ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేఎల్. శర్మను రంగంలోకి దించుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మొత్తానికి కొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.

సోనియాగాంధీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో రాయ్బరేలీ స్థానం ఖాళీ అయింది. అయితే సోనియా స్థానంలోకి కుమార్తె ప్రియాంక రావొచ్చని వార్తలు వినిపించాయి. కానీ చివరికి రాహులే ఇక్కడ నుంచి పోటీ చేయొచ్చని ఆ వర్గాలు భావిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.. గాంధీ కుటుంబానికి వీర విధేయుడు కేఎల్. శర్మను అమేథీ నుంచి బరిలోకి దించవచ్చని ప్రచారం జరుగుతోంది.
రాయ్బరేలీ, అమేథీ స్థానాలకు మే 20న పోలింగ్ జరగనుంది. ఇక ఈ రెండు స్థానాలకు శుక్రవారం నామినేషన్కు చివరి రోజు. అయినా కూడా ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కార్యకర్తలు అయోమయం.. గందరగోళానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఉభయసభల్లో తల్లి, కొడుకు ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక కూడా బరిలోకి దిగితే.. బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుందన్న భావనతోనే ప్రియాంక వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. గాంధీ కుటుంబంపై బీజేపీ నుంచి విమర్శలు రాకూడదన్న భావనతోనే ప్రియాంక పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ జరగింది. ఇక మూడో విడత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.