Lightning struck the school..10 people were injured: భారీ వర్షాలు వరదలతో ఒడిశా రాష్ట్రం అల్లాడుతోంది. పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే కొన్ని రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచానా వేస్తోంది. ఇదిలా ఉంటే ఒడిశాలోని దియోగర్ జిల్లాలో పాఠశాలపై పిడుగు వేయడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
దియోనగర్ జిల్లా తిలేబాని బ్లాక్ పరిధిలోని పుతురపాసి ప్రాథమిక పాఠశాలతో 17 మంది విద్యార్థులు ఉండగా..పాఠశాల గదిపై పిడుగు పడింది. దీంతో 10 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగుపాటు కారణంగా విద్యార్థులు కాలిన గాయాలకు గురయ్యారు. పిడుగు ప్రభావానికి విద్యార్థులు ఉన్న స్కూల్ బిల్డింగ్ కు రంధ్రం పడి, పై కప్పు నేలపై పడింది. పిడుగు పడే సమయంలో భారీగా వర్షం కురువడంతో విద్యార్థులంతా స్కూల్ గదిలోనే ఉన్నారు. గాయపడిన విద్యార్థులంతా మూడు, ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులే.
Read Also: China: కరువు కోరల్లో చైనా.. “జాతీయ కరువు హెచ్చరిక” జారీ
పిడుగుపాటుకు గురైన వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేశామని..10 మంది విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించామని.. అందులో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి సచ్చిదానంద్ బెహెరా తెలిపారు. తీవ్రంగా గాయపడిన నలుగురు విద్యార్థుల అవయవాలు సరిగా పనిచేయడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని కటక్ లో 55 ఏళ్ల రైతు తన పొలం దగ్గర ఉండగా పిడుగుపాటుకు గురై మరణించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్థారించారు.
ఈశాన్య, తూర్పు-మధ్య బంగాళాఖాతం, బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలను అనుకుని ఉన్న ప్రాంతాలపై ఈ రోజు మరో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అల్పపడనం బలపడే అవకాశం ఉందని తెలుస్తోంది. కియోంజర్,మయూర్భంజ్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.