KTR Challenges Revanth Reddy: హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన బీఆర్ఎస్ యువజన సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన యూత్ డిక్లరేషన్ హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. ఇదే సరూర్నగర్ వేదికపై కాంగ్రెస్ నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినా యువతకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని కేటీఆర్ విమర్శించారు. ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్లు, మహిళలకు స్కూటీలు, భారీ ఉద్యోగ నియామకాలు వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి గాంధీలు, గాంధీభవన్ నుంచి గాడ్సేలు వచ్చి యువతను మోసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. “కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇచ్చిందని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను” అని అన్నారు. రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వనని మాట్లాడుతున్నారని ఆరోపించిన కేటీఆర్.. “తెలంగాణ ఏమైనా నీ అయ్య జాగీరా?” అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి అహంకారం పెరిగిపోయిందని విమర్శించారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను “బీరు, బిర్యానీ బ్యాచ్” అని వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు.
నిరుద్యోగ యువతలో తీవ్ర అసంతృప్తి ఉందని, వారికి ఆకలి ఉద్యోగాల కోసమేనని కేటీఆర్ పేర్కొన్నారు. యువశక్తి ఒక్కసారి పోటెత్తితే అధికార పీఠాలు కదిలిపోతాయని హెచ్చరించారు. చివరగా రేవంత్ రెడ్డి పాలనకు ముగింపు హిట్లర్ ముగింపుకంటే దారుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

