మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మిస్టర్ హరీష్ రావు.. మీలాగా మాటలు కాదు, చేతల ప్రభుత్వం మాది అని విమర్శించారు. విద్యా, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాం అని, శంకుస్థాపన స్థాయిలో వదిలి వెళ్లిపోయిన హాస్పిటల్స్ ఈ 21 నెలల్లో వేగంగా నిర్మిస్తున్నాం అని అన్నారు. మీ ప్రభుత్వం 40 వేల కోట్ల బకాయి పెట్టిపోతే.. తాము చెల్లిస్తున్నాంఅని మండిపడ్డారు. నిత్యం మా ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నాను అని, రేయింబవళ్లు పనులు వేగంగా జరుగుతున్నాయని కోమటిరెడ్డి చెప్పకొచ్చారు.
‘సనత్ నగర్ టిమ్స్ అక్టోబర్ 31కి ప్రారంభిస్తామని ఇప్పటికే చెప్పాం. అల్వాల్ హాస్పిటల్ వద్ద 1000 మంది ఒకే షిఫ్టులో పనిచేస్తున్నారు. వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తాం. ఎల్బీనగర్ వచ్చే జూన్ నాటికి అందుబాటులోకి తెస్తాం. నిమ్స్ హాస్పిటల్ 2 వేల కోట్లతో నిర్మిస్తున్నాం, వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. వరంగల్ హాస్పిటల్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తాం. ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి రాజకీయం కోసం పొలిటికల్ విజిట్స్ చేశారు. ప్రజల మేలు కోసం మేము చిత్త శుద్ధితో పనిచేస్తున్నాం’ అని హరీష్ రావును ఉద్దేశించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల నూతన భవనంను మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
Also Read: Pharma Hub: ఫార్మా రంగంలో మరో మైలురాయి.. హైదరాబాద్ నుంచే ప్రపంచ స్థాయి ఔషధాల తయారీ!
‘సుమారు 8 కోట్ల వ్యయంతో కార్పోరేట్ స్థాయి హంగులతో ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల నిర్మించాం. త్వరలో డిజిటల్ క్లాస్తో పాటు ఏసీ రూంలు ఏర్పాటు చేయనున్నాం. ఈ పాఠశాల తెలుగు రాష్ట్రాల్లో కెల్లా బెస్ట్ మోడల్ స్కూల్గా నిలవనుంది. విద్యకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ప్రపంచంతో పోటీ పడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ అంతా కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించాలని నిర్ణయించాం. 20 వేల కోట్లతో అన్ని నియోజకవర్గాల్లో ఈ అధునాతన రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నాం. నల్గొండలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్లాబ్ లెవల్ వరకు వచ్చింది. ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాలను ఇంత చక్కగా నిర్మించేందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, జిల్లా కలెక్టర్ హరి చందన, ఆర్ అండ్ బీ అధికారులు, నిర్మాణ సంస్థకు నా శుభాకాంక్షలు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు నా శుభాశీస్సులు’ అని మంత్రి కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.