KL Rahul Rect on Shower during IND vs AUS Match: ఆస్ట్రేలియా మ్యాచ్లో కీపింగ్ చేసి అలసిపోయిన తనకు భారత్ బ్యాటింగ్ సమయంలో స్నానం చేసే టైమ్ కూడా దొరకలేదని టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. భారత్కు ప్రపంచకప్ అందించడమే తన కల అని పేర్కొన్నాడు. తన ప్రదర్శన పేలవంగా ఏమీ లేకపోయినా జనం తనను విమర్శించినప్పుడు బాధపడ్డానని రాహుల్ చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. భారత్ విజయంలో రాహుల్ కీలక పాత్ర పోషించాడు.
భారత్ బౌలింగ్ దాటికి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 199 పరుగులకు ఆలౌట్ అయింది. ఛేదనలో భారత్ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో విరాట్ కోహ్లీతో కలిసి కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నాడు. 97 పరుగులతో అజేయంగా నిలిచిన తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. టీమిండియా విజయం అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన రాహుల్.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ అనంతరం కీపింగ్ చేసి అలసిపోయిన తాను స్నానం చేసి ఓ గంట పాటు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడట. అయితే భారత్ త్వరగా మూడు వికెట్స్ కోల్పోవడంతో.. మూడో ఓవర్లోనే రాహుల్ మైదానంలోకి వచ్చాడు.
‘గతంలో ప్రతి మ్యాచ్లో నా ప్రదర్శనను జనం తీవ్రంగా విమర్శించారు. నా ప్రదర్శన అంతా పేలవంగా ఏమీ లేకపోయినా.. ఎందుకలా విమర్శించారో అర్థం కాలేదు. అప్పుడు చాలా బాధనిపించింది. గాయం నుంచి కోలుకునే ప్రక్రియలో బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఐపీఎల్ 2023 సందర్భంగా గాయపడ్డా. 5-6 నెలలు ఆటకు దూరమయ్యా. ప్రపంచకప్లో ఆడడం కూడా అనుమానంగా మారింది. అది నాకు చాలా కష్టంగా అనిపించింది. దేవుడి దయతో త్వరగా కోలుకున్నా. ప్రపంచకప్లో ఆడడం ప్రతి క్రికెటర్ కల. సొంతగడ్డపై భారత్కు ప్రపంచకప్ అందించడమే నా లక్ష్యం’ అని రాహుల్ తెలిపాడు.
Also Read: Mr Tamilnadu Death: ‘మిస్టర్ తమిళనాడు’ మృతి.. బాత్రూమ్కు వెళ్లి..!
‘ఆస్ట్రేలియా మ్యాచులో భారత్ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి సమయంలో నేను క్రీజులోకి వచ్చాను. అప్పుడు నేను, విరాట్ కోహ్లీ పెద్దగా మాట్లాడుకోలేదు. అయితే పిచ్ కష్టంగా ఉంది.. కాసేపు టెస్ట్ మ్యాచ్ ఆడు అని విరాట్ సలహా ఇచ్చాడు. వికెట్ కీపింగ్ చేసిన నేను చెన్నైలో ఉక్కపోతకు చాలా అలసిపోయా. స్నానం చేసి ఓ హాఫ్ అన్ హావర్ లేదా గంట రెస్ట్ తీసుకుందామనుకున్నా. కానీ నాకు ఆ టైమ్ దొరకలేదు’ అని టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ చెప్పాడు.