Kishan Reddy: జూన్ 8 లేదా 9న మూడో సారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. దేశం కోసం ఓటెయ్యండి.. అభివృద్ధి కోసం ఓటెయ్యండి అంటూ ప్రజలకు ఆయన సూచించారు. భారత దేశ గౌరవాన్ని పెంచడం కోసం ఓటెయ్యాలన్నారు. మోడీ ప్రధాని అయ్యేవరకు దేశం ఎలా ఉండేది.? ఆలోచించాలన్నారు. మోడీ వచ్చాక దేశం ఎలా అభివృద్ధి చెందిందో ఆలోచించాలని పేర్కొన్నారు. పదేళ్లకు ముందు దేశంలో ఉగ్రవాదం, మత కల్లోలాలు ఉండేవి..మేము వచ్చాక బుల్డోజర్ ప్రభుత్వం వచ్చిందన్నారు. దేశంలో ఎటువంటి మార్పులు వచ్చాయో చూడాలన్నారు. గతంలో కీలు బొమ్మలాంటి ప్రధాని ఉండేవారని.. మోడీ ప్రధాని అయ్యాక ప్రపంచలో నంబర్ వన్గా అయ్యామన్నారు.
పదేళ్లకు ముందు అన్ని వస్తువులు విదేశాల నుంచి వచ్చేవని.. మోడీ వచ్చాక చిన్న పిల్లల బొమ్మల నుంచి చంద్రయాన్ వరకు మనమే తయారు చేస్తున్నామన్నారు. రక్షణ శాఖ ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నామన్నారు. మన్మోహన్ సింగ్ పదేళ్లు పరిపాలించారని.. కాంగ్రెస్ హయాంలో పదిహేను రోజులకో కుంభకోణం జరిగేదని విమర్శించారు. వందల, వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ హయాంలో దోపిడీ చేశారని ఆరోపించారు. బీజేపీ పాలనలో ఒక్క రూపాయి దుర్వినియోగం చేయలేదన్నారు.
Read Also: Maldives: మాల్దీవుల మాజీ మంత్రి సోషల్ మీడియా పోస్ట్ వైరల్.. భారత్కి క్షమాపణలు..
బీజేపీ పుట్టిందే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా అంటూ ఆయన తెలిపారు. బీజేపీ చేసిన అభివృద్ధికి.. కాంగ్రెస్ చేసిన అభివృద్ధికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370తొలగిస్తామని చెప్పాం.. చేశామన్నారు. జమ్మూ కాశ్మీర్లో జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తెచ్చామన్నారు. మళ్లీ జిన్నా రాజ్యాంగాన్ని తెస్తామని రాహుల్ గాంధీ చెప్తున్నాడని విమర్శించారు. లవ్ జీహాదిని చట్టపరం చేస్తామని చెప్తున్నారని ఆయన పేర్కొన్నారు. మీ ప్రభుత్వంలో.. పోలీస్ శాఖలో లవ్ జీహాదిని కాపాడే విభాగాన్ని ఏర్పాటు చేశారా అంటూ రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. తలాక్ తలాక్ తీసేసి ముస్లిం ఆడబిడ్డలను రక్షించామన్నారు. చట్టం రద్దుకు ముస్లింలు స్వాగతం పలికారన్నారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టో హిందూ వ్యతిరేక మేనిఫెస్టో. స్వాత్యంత్రం రాకముందు ఉన్న ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. జీఎస్టీని రద్దు చేస్తాం.. కుంభకోణాలను ఎంకరేజ్ చేస్తాం అంటున్నారు. తెలంగాణకు అనేక హామీలని తుక్కుగూడ నుంచి రాహుల్ ఇచ్చారు. రాష్ట్రానికి మీరిచ్చిన గ్యారెంటీలు ఎంత వరకు అమలు చేశారు.. చెప్పండి.? రుణమాఫీ ఎంత వరకు చేశారు.? రేవంత్ రెడ్డి ఒక మాట ముందుకు వచ్చి చెప్పాడు. డిసెంబర్ లో రుణమాఫీ చేస్తామని చెప్పాడు. నిధులు ఎక్కడ నుంచి తెస్తావు రేవంత్ రెడ్డి చెప్పాలి.? ఎకరానికి 15వేలు ఎక్కడికి పోయినయ్.? మీ గ్యారంటీలు ఎక్కడికి పోయినయ్.? బస్సులల్ల తిరిగితే అన్నీ ఇచ్చాం అనుకోండి అంటున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పారు.. చేశాం.. ఇది మోడీ గ్యారెంటీ. అనేక పోరాటాల తరువాత అయోధ్యలో రామ మందిరాన్ని కట్టుకున్నాం.. మోడీ హయాంలో రామ మందిరం పూర్తయ్యింది.. కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం పేరుతో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు.. దేవాలయాన్ని ధ్వంసం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ కూర్చుంది.. అయోధ్య ఆలయాన్ని జవహర్ లాల్ నెహ్రూ అడ్డుకున్నాడు.. వల్లభాయ్ పటేల్ అయోధ్యను కాపాడుదాం అంటే నెహ్రూ ఆపాడు.” అని కిషన్ రెడ్డి తెలిపారు.