గత ప్రభుత్వంలో దుశ్శాసన పాత్ర పోషించిన ఎంఐఎం ప్లేట్ పిరాయించి కాంగ్రెస్ పంచన చేరిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో జీప్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చీకటి వ్యాపారాలు చేస్తూ, దౌర్జన్యంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పార్టీ ఎంఐఎం అని ఆయన మండిపడ్డారు. ఆ పార్టీ కి చీకటి దందాలకు అండా కావాలి, బీజేపీ ఓడి పోవాలన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం ఒవైసీ కి ఒంగి ఒంగి సలాం కొట్టేవారని, అసెంబ్లీ ఎన్నికలకి ముందు కెసిఆర్ ను ఒవైసీ మెచ్చుకున్నారు… ఈ దేశ్ కి నేత ను వదిలేసి ప్లేట్ ఫిరాయించాడన్నారు. తెలంగాణ లో సోనియా, ఒవైసీ కుటుంబం వచ్చిందన్నారు కిషన్ రెడ్డి. దౌర్జన్యంగా హిందువుల ఇళ్లను ఖాళీ చేయించిన చరిత్ర ఎంఐఎంది అని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మతకలహాలు, అవినీతి కుంభకోణాలేనని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే.. దేశంలో మళ్లీ కుటుంబ పాలన వస్తుందన్నారు. పాలన పగ్గాలు చేపట్టి వంద రోజులు దాటినా హామీల అమలు ఊసేలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు.
మోడీ హయాంలోనే రామ మందిర నిర్మాణం సాకారమైందని తెలిపారు. ఎయిర్పోర్టులు, వ్యవసాయ రంగం, రైల్వే ఇలా ప్రతి రంగం అభివృద్ధి చెందిందన్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి గెలవడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత సికింద్రాబాద్ రూపురేఖలు మారిపోతాయన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంపై తీరుపై విరుచుకుపడ్డారు కిషన్రెడ్డి. ఆ మూడు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. సొంత నియోజకవర్గం సికింద్రాబాద్పై ఫోకస్ పెట్టారు కిషన్రెడ్డి. ఉదయం నుంచి రాత్రివరకూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.