Kishan Reddy : బొగ్గు శాఖ పురోగతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2047 వికసిత భారత లక్ష్యాల్లో బొగ్గు రంగం చాలా కీలకమని,
ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. బొగ్గు నిల్వల్లో ప్రపంచంలో 5వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గు వినియోగదారుగా భారతదేశం ఉందని, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బొగ్గు గని గెవరా మన దేశంలో ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. కోలిండియా బొగ్గు మంత్రిత్వ శాఖ కీలకమైన విభాగమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది కోలిండియా స్వర్ణజయంత్యుత్సవాలు జరుపుకుంటోందన్నారు కిషన్ రెడ్డి. కోలిండియా ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అని, పవర్, స్టీల్, సిమెంట్, అల్యూమినియం, ఫెర్టిలైజర్, హెవీ ఇండస్ట్రీస్ రంగాల్లో బొగ్గు కీలకమైన అంశమన్నారు. భారతదేశంలో బొగ్గు ద్వారానే 74% విద్యుదుత్పత్తి జరుగుతోందని, రానున్న దశాబ్దాల్లోనూ బొగ్గు ఒక కీలకమైన ఇంధనంగా ప్రత్యేకతను సంతరించుకుందని కిషన్ రెడ్డి వెల్లడించారు.
అంతేకాకుండా..’బొగ్గును నల్ల బంగారమని, కుకింగ్ కోల్ ను బ్లాక్ డైమండ్ అంటారు. దేశంలో వివిధ రంగాలకు బొగ్గు అత్యంత కీలకమైన ఇంధనం. 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వివిధ రంగాల్లో సంస్కరణలు వచ్చాయి. బొగ్గు రంగంలోనూ మౌలికమార్పులు, విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. పారదర్శకంగా కోల్ బ్లాక్స్ వేలం వేయడం, కమర్షియల్ కోల్ మైనింగ్, పాలసీ రిఫార్మ్స్, కోల్ గ్యాసిఫికేషన్, టెక్నాలజీ వంటి వినియోగం పెరిగింది. భారత బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. నిర్ణయాలు తీసుకుని.. పారదర్శకంగా వాటిని అమలు చేయడం వల్లే ఉత్పత్తి పెరిగింది. 2023-24లో 998 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. 2014లో ఇది కేవలం 609 కోట్ల బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగేది. బొగ్గు రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం పెరిగిన తర్వాత మరింత పోటీ పెరిగింది. దీని ద్వారా చాలా సానుకూల మార్పులు వచ్చాయి. ఇప్పటివరకు 10 విడతల పాటు పారదర్శక వేలం పూర్తయింది. 184 బ్లాక్స్ వేలం జరిగింది’ అని కిషన్ రెడ్డి అన్నారు.
Shabbir Ali : అమెరికాతో మాట్లాడే దమ్ము కేంద్రానికి లేదు