కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) నిరసన చేపట్టనుంది. ఫిబ్రవరి 8న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపనున్నట్లు పేర్కొంది. కేరళ, ఇతర బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను కేంద్రం ఆర్థికంగా నిర్లక్ష్యం చేసిందని ఆందోళన చేయడం ఈ నిరసన లక్ష్యమన్నారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ తెలిపారు. ఇది.. కేవలం కేరళ సమస్యలకు సంబంధించినది కాదని, ఇతర బీజేపీయేతర రాష్ట్రాలు పంచుకుంటున్న విస్తృత ఆందోళనకు ప్రతినిధి అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: Sashastra Seema Bal: ఎస్ఎస్బీ చీఫ్గా సీనియర్ ఐపీఎస్ అధికారి దల్జీత్ సింగ్ చౌదరి నియామకం..
ఈ సందర్భంగా గోవిందన్ మాట్లాడుతూ.. రాష్ట్ర స్వయంప్రతిపత్తిపై ఆరోపణ, కేంద్రం విధించిన ఆర్థిక పరిమితులపై ఆందోళనలను ఎత్తిచూపుతూ నిరసనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి విజయన్ బిజెపియేతర ముఖ్యమంత్రులందరికీ లేఖ రాశారన్నారు. కాగా.. బీజేపీ రెచ్చగొట్టే రీతిలో హిందూత్వ ఎజెండాను కొనసాగిస్తోందని, ఈ విశ్వాసాన్ని రాజకీయం చేసే మతోన్మాద ధోరణిని దేశంలో చూస్తోందన్నారు. ప్రజలందరికీ తమ మతాన్ని విశ్వసించే, ప్రచారం చేసే హక్కు ఉండటమే నిజమైన లౌకిక విధానమన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని బీజేపీ రాజకీయ సాధనంగా ఉపయోగిస్తున్నారని, ఇంకా రామమందిరం పూర్తికాలేదన్నారు.
Read Also: Bodige Galanna Passed Away: మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కుటుంబంలో తీవ్ర విషాదం
లోక్సభ ఎన్నికలకు ముందు ఈ రామమందిరాన్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని గోవిందన్ పేర్కొన్నారు. తాము దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని తెలిపారు. అంతేకాకుండా.. అసంపూర్తిగా ఉన్న రామమందిరంలో ప్రాణప్రతిష్ట చేయడం తమ విశ్వాసాలకు, ఆచారాలకు విరుద్ధమని శంకరాచార్యులు అభిప్రాయపడ్డారని ఆయన అన్నారు. ఇది విశ్వాసానికి విరుద్ధమైనా.. ఎన్నికల అస్త్రంగా వాడుకుంటున్నారని గోవిందన్ మండిపడ్డారు.