Sai Dharam Tej incident: ఆదివారం రోజు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మేనల్లుడు, మెగా హీరో సాయిధరమ్ తేజ్పై దాడికి యత్నించారంటూ ప్రచారం జరిగింది.. సాయి ధరమ్ తేజ్పై దుండగులు కూల్డ్రింక్ సీసాలతో దాడి చేశారని.. ఈ ఘటనలో జనసేనకు చెందిన ఓ యువకుడికి గాయాలు అయినట్టు తెలసింది.. అయితే, ఈ ఘటనపై స్పందించారు కాకినాడ డీఎస్పీ కోపల్లె హనుమంతరావు.. సాయిధరమ్ తేజ్పై ఎటువంటి దాడి జరగలేదని స్పష్టం చేశారు.. తాటిపర్తి గ్రామంలో ప్రచారం ప్రశాంతంగా జరిగిందన్న ఆయన.. సాయి ధరమ్ తేజ్ వెహికల్ అక్కడి నుంచి వెళ్లిపోయిన 30 నిమిషాల తర్వాత ఒక యువకుడిపై ఎవరో రాయి విసిరితే.. ఆ యువకుడికి తగిలింది.. అంతేకానీ, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్పై గాజు సీసాతో దాడి అనేది అసత్యం.. దీనిపై అసత్య ప్రచారం చేయడం తగదని సూచించారు.
Read Also: Chandrababu: కల్లూరు సభలో భూహక్కు పత్రాన్ని తగలబెట్టిన చంద్రబాబు
కాగా, ఆంధ్రప్రదేశ్లో జరుగుతోన్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థిగా.. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయన తరపున పిఠాపురంలో ఎంతోమంది సినీ, టీవీ పరిశ్రమకు చెందినవారు ప్రచారం చేస్తూ వస్తున్నారు.. ఇక, మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు కూడా రంగంలోకి దిగారు.. ఇప్పటికే వరుణ్ తేజ్ ప్రచారం నిర్వహించగా.. తాజాగా, సాయి ధరమ్ తేజ్ కూడా తమ మేనమామ గెలుపుకోసం ప్రచారంలోకి దిగారు.. అయితే, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో సాయి ధరమ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో.. అతడిపై కూల్ డ్రింక్ బాటిల్ విసిరారని. సాయి ధరమ్ తేజ్కు తృటిలో ప్రమాదం తప్పగా.. ఆ పక్కనే ఉన్న జనసేన నాయకుడు నల్ల శ్రీధర్కు ఆ కూల్ డ్రింక్ బాటిల్ తగలడంతో తీవ్ర గాయం అయినట్టు వార్తలు వచ్చిన విషయం విదితమే.