NTV Telugu Site icon

Indore : 21 ఏళ్ల క్రితం చనిపోయిన మామ.. కట్నం కోసం వేధిస్తున్నాడని కాజల్ ఫిర్యాదు

Male Ghos

Male Ghos

Indore : మహారాష్ట్రలో నివసిస్తున్న శివ, కాజల్‌ను ఇండోర్‌లో 4 సెప్టెంబర్ 2013న వివాహం చేసుకున్నాడు. కాజల్ తండ్రి గతంలో మహారాష్ట్రలో ఉద్యోగం చేసేవారు. వీఆర్‌ఎస్‌తో తన మకాం ఇండోర్‌కు మార్చుకున్నాడు. శివ, కాజల్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లయిన కొద్ది రోజుల పాటు అంతా సజావుగా సాగింది. కాజల్‌కి తన గురించి ఏదైనా చేయాలనే కోరిక బలంగా ఉండేది. తనను ఎయిర్ హోస్టెస్ కోర్సు చేయడానికి అనుమతించమని ఆమె తన భర్తయిన శివను కోరింది. అందుకు భర్త కూడా అంగీకరించాడు. ఆమె చదువుల కోసం పది లక్షలు కూడా వెచ్చించాడు. కాజల్ కోర్సు పూర్తయింది. ఇప్పుడు ఆమె ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించింది. కానీ శివ ఆమెను ఎక్కడికీ వెళ్లనివ్వలేదు.

Read Also:Perni Nani: టీడీపీ కోసమే పవన్‌ పార్టీ పెట్టారు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

ఇంతలో కాజల్ గర్భిణి కావడంతో.. డెలివరీ నిమిత్తం ఇండోర్ వచ్చింది. ఉద్యోగానికి తన భర్త అనుమతి ఇవ్వలేదని పేరెంట్స్ వద్ద వాపోయింది. అందుకే ఇంటికి రాగానే ఫోన్ ఆఫ్ చేసింది. ఆమెకు డెలివరీలో కుమార్తె పుట్టింది. కొన్ని రోజుల తర్వాత, కాజల్ తన లాయర్ల ద్వారా ఇండోర్ జిల్లా కోర్టులో తన భర్త, అత్తపై ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఇండోర్ జిల్లా కోర్టు కేసు నమోదు చేయాలని సంబంధిత పోలీసులను ఆదేశించింది. ఫిబ్రవరి 13, 2023న, కోర్టు నిందితులకు సమన్లు ​జారీ చేసింది. ఏప్రిల్ 10, 2023న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు సమన్లు ​అందడంతో శివకు విషయం తెలిసింది. శివ ఇండోర్ వచ్చాడు. తన భార్య కాజల్ తప్పుడు అఫిడవిట్ ఇచ్చి కోర్టును మోసం చేసిందని తన లాయర్ ప్రీతి మెహ్రా ద్వారా కోర్టుకు తెలిపాడు. అతను ఇచ్చిన సమాచారంతో కోర్టు కూడా అయోమయంలో పడింది.

Read Also:Simhadri: రీరిలీజ్ సినిమాకి ప్రీరిలీజ్ ఈవెంట్… ఇదెక్కడి అరాచకం సామీ

15 లక్షల కట్నం కోసం భర్త, అత్తమామలు, తనను వేధిస్తున్నారని కాజల్ కోర్టుకు తెలిపింది. దీని ప్రకారం, కోర్టు ఫిబ్రవరి 13, 2023న ముగ్గురిపై సమన్లు ​​జారీ చేసింది. అయితే కాజల్‌కు పెళ్లి కాకముందే శివ తన తండ్రి చనిపోయాడని లాయర్ ప్రీతి మెహ్రా ద్వారా శివ కోర్టుకు తెలియజేశాడు. తన తండ్రి ఫిబ్రవరి 14, 2002న చనిపోయాడని.. తను చనిపోయి 21 ఏళ్లు అవుతుందని శివ కోర్టుకు తెలియజేశాడు. తన తండ్రి మరణ పత్రాలను కూడా కోర్టు ముందు సాక్ష్యంగా సమర్పించాడు. భార్య కోర్టులో తప్పుడు అఫిడవిట్ సమర్పించిందని తెలిపాడు. తనపై, చనిపోయిన తన తండ్రిపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. దీని తర్వాత తప్పుడు దరఖాస్తును సమర్పించి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి సమయం వృధా చేశారంటూ కాజల్‌పై శివ, అతని తల్లి పిటిషన్ వేశారు. మరికొద్ది రోజుల్లో ఈ వ్యవహారంపై విచారణ జరగనుంది. అయితే ఈ కేసును కోర్టు ఎలా విచారిస్తుందనేది ముఖ్యం.