KA Paul: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం అందరికి తెలిసిన విషయమే. షర్మిల కాంగ్రెస్లో చేరడంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం పెద్ద తప్పిదమన్నారు. ఆస్తులు, పదవి కోసం సోనియాకు షర్మిల తన పార్టీని అమ్మేశారని విమర్శించారు. షర్మిలా నీకు రాజకీయాలు అవసరమా? అంటూ మండిపడ్డారు. రాజారెడ్డి, వైయస్ ఆత్మలతో తాను మాట్లాడుతానన్నారు. వారు బతికి ఉంటే షర్మిల పార్టీ విలీనాన్ని అడ్డుకునేవారని, ఇప్పుడు వారి ఆత్మ ఘోషిస్తుందని వెల్లడించారు. షర్మిల నీకు రాజకీయాలు అవసరమా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. జగన్ను తిట్టడం, రాష్ట్రాన్ని నాశనం చేయడం షర్మిల పని అంటూ ఆయన వ్యాఖ్యానించారు. షర్మిలను ఏపీకి తీసుకువచ్చి నాశనం చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
Read Also: APSRTC: సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్
షర్మిల వెంట మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పిచ్చి కుక్కలాగా పరిగెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్లో తన పార్టీ విలీనం చేసినప్పుడు షర్మిల డాన్స్ చేయాల్సి ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్ చనిపోయినా ఆయన్ను సోనియా వదలడం లేదన్నారు. వైఎస్ పేరుని చార్జిషీట్లో సోనియా పెట్టారని.. జగన్ను జైల్లో పెట్టారని.. వైఎస్ కుటుంబాన్ని సోనియా వేధించారన్నారు. వైఎస్ తకు మధ్య గొడవలకు కారణం సోనియా అని చెప్పుకొచ్చారు. ఆమె ఆ పార్టీ నేతలతో పాద పూజ చేయించుకుంటుందన్నారు. ఇక దేశాన్ని సర్వ నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని.. ఏపీని సోనియా చంపేసిందంటూ విమర్శించారు. జగన్ అంటే ఇష్టం లేని వారు తమ పార్టీలో కానీ, టీడీపీ, జనసేనలో చేరాలన్నారు. కాంగ్రెస్లో ఎవరూ జాయిన్ కావద్దని కోరారు. ప్రజాశాంతి పార్టీని విలీనం చేస్తే.. ముఖ్యమంత్రి చేస్తామని లేదా కేంద్రమంత్రి చేస్తామని తనకు ఆఫర్ ఇచ్చారంటూ పాల్ చెప్పుకొచ్చారు.
Read Also: Kapu Ramachandra Reddy: ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తా.. వైసీపీకి ఎమ్మెల్యే గుడ్బై!
మరోవైపు తనను చంపే ప్రయత్నం చేశారని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 25న తనను చంపే ప్రయత్నం జరిగిందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ పండుగనాడు తనకు ఫుడ్ పాయిజనింగ్ ఇచ్చారని వెల్లడించారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు. దేవుడి దయవల్ల ఫుడ్ పాయిజన్ నుంచి బతికి బయట పడినట్లు స్పష్టం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా జరిగిందని పేర్కొన్నారు. తాను ఎవరికీ భయపడనని ఆయన అన్నారు. ఈ సమయంలో వారి పేర్లు చెప్పాలని అనుకోవడం లేదన్నారు.