ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టైన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉంది. కవితను బయటకు తీసుకువచ్చేందుకు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈరోజు ఎవరైనా బెయిల్ ఇప్పించగలరా? న్యాయంగా పోరాడితే నేను బెయిల్ ఇప్పించగలనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. సీబీఐ భయం ఉంటే… ఐటీ సోదాల భయం ఉంటే ఎవరైనా తన వద్దకు రావొచ్చని తాను వారిని కాపాడుతానని కేఏ పాల్ వెల్లడించారు.
‘ఈరోజు కేసీఆర్ పూర్తిగా ఫినిష్ అయిపోలేదా? వందసార్లు.. వేయిసార్లు మార్పు చెందు కేసీఆర్, లేదంటే చిత్తుచిత్తుగా ఓడిస్తామని చెప్పలేదా? నువ్వు మారావా? పైగా నన్ను కొట్టించావ్… మే 2, 2022లో నీ కొడుకుతో… అనిల్ రెడ్డితో సిరిసిల్లలో కొట్టించావ్. ఆ రోజే నిన్ను శపించాను. నువ్వు మసి అయిపోలేదా? ఇప్పుడైనా గుండె ఆగి చనిపోవా? కానీ వద్దు… వరంగల్లో బాబు మోహన్కు మద్దతివ్వు… నేను నిన్ను క్షమిస్తా.. అలాగే 12 లోక్ సీట్లలో గెలిపిస్తాను’ అని వ్యాఖ్యానించారు. 1451 సినిమాల్లో నటించిన బాబుమోహన్ టీడీపీని కాళ్లతో తన్ని బీజేపీలో చేరి… ఆ తర్వాత బీజేపీని కాళ్లతో తన్ని ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరారో ఆలోచించాలన్నారు. బాబుమోహన్ హిస్టారిక్ యాక్టర్ అని, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. ఏపీ రాజకీయాలపై కూడా పాల్ స్పందించారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎందుకు మద్దతివ్వడం లేదు? నాకే సీక్రెట్గా ఎందుకు మద్దతిస్తున్నారు? ఏపీ ప్రజలు ఆలోచించాలని కోరారు కేఏ పాల్.