తెలంగాణపై బీజేపీ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు.. గత ఆదివారం తెలంగాణలో పర్యటించిన అమిత్ షా ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్తో భేటీ అయ్యారు. అయితే ఈ అమిత్ షా, జూ.ఎన్టీఆర్ భేటీపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు శంషాబాద్ నోవాటెల్ హోటల్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, హీరో నితిన్ భేటీ కానున్నారు. అయితే.. ఇప్పటికే.. నోవాటెల్ హోటల్కి హీరో నితిన్ చేరుకున్నారు. అయితే.. వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే.. ఉదయం ప్రముఖ స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్తో నడ్డా భేటీ అయ్యారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్తో శంషాబాద్ నోవాటెల్ హోటల్లో భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో జేపీ నడ్డా పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్తో సంభాషణ గొప్పగా సాగిందని వివరించారు. ప్రధాని మోదీ అందించిన వ్యక్తిగత మద్దతు, మార్గదర్శకత్వాన్ని మిథాలీ రాజ్ ప్రశంసించినట్టుగా ఆయన తెలిపారు.