Jeedimetla: జీడిమెట్లలో కలకలం రేపిన తల్లి, పిల్లల మరణ ఘటనపై తాజాగా కొత్త వివరాలు బయటకు వచ్చాయి. కరోనా తర్వాత తేజస్విని తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భర్త వెంకటేశ్వర్ రెడ్డి డ్యూటీకి వెళ్లిన తర్వాత, పిల్లలు స్కూల్కు వెళ్లాక తేజస్విని ఇంట్లో ఒంటరిగా ఉండే పరిస్థితి ఏర్పడడంతో.. ఆమెలో ఒంటరితనంతో పాటు తీవ్రమైన డిప్రెషన్ ఏర్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే గురువారం మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో తేజస్విని తన తల్లితో ఫోన్లో మాట్లాడింది. ఆమె తన తల్లితో పిల్లలు కింద ఆడుకుంటున్నారు, నేను పడుకున్నాను అని తేజస్విని చెప్పిందని తల్లి తెలిపారు. తేజస్వినికి పిల్లల్ని చూసుకోమని చెప్పిన తల్లి, అనంతరం నాలుగున్నర ప్రాంతంలో మళ్లీ కాల్ చేయగా దారుణమైన వార్త.. తేజస్వినితో పాటు ఇద్దరు పిల్లలు మరణించినట్లు ఫోన్లో చెప్పారని తల్లి తెలిపింది.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తేజస్విని డిప్రెషన్తో బాధపడుతూ, చివరికి పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు ఆర్థిక పరిస్థితులు గానీ, భార్యాభర్తల మధ్య విభేదాలు గానీ కారణాలు కావని.. తేజస్వినికి కేవలం మానసిక సమస్యలే బాధగా మారినట్లు తెలిపారు. ఈ విషాద సంఘటన సమయంలో మరింత బాధపెట్టించే విషయం ఏమిటంటే.. రేపే (శనివారం) చిన్నారి హర్షిత్ రెడ్డి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు వేడుక కోసం హర్షిత్ రెడ్డికి కొత్త బట్టలు కొనుగోలు చేసారు అమ్మమ్మతాతయ్యలు. హైదరాబాద్కు వచ్చి సంబరంగా జరిపేందుకు సిద్ధమవుతుండగా, ఈ దారుణ ఘటన తీవ్రంగా కలవరపరిచింది.
తేజస్వినికి పెద్దమ్మ అయిన కృష్ణవేణి మాట్లాడుతూ, వారి కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని.. ఆర్థికంగా కూడా స్థిరంగా ఉన్న కుటుంబమేనని తెలిపారు. మానసికంగా తేజస్విని ఇబ్బందిపడినందువల్లే ఈ దారుణ ఘటన జరిగిందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటన మరే ఇతర కుటుంబంలో జరగకుండా, డిప్రెషన్కు లోనైన వారి పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ ఘటన మానసిక ఆరోగ్యంపై సమాజం ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
ఘటనపై తేజస్విని భర్త వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. మానసికంగా సరిగ్గా లేకనే తేజస్విని ఇలా చేసి వెళ్ళిందని తెలిపారు. మా ఇద్దరి మధ్య ఇలాంటి ఇబ్బందులు, విభేదాలు లేవని.. మా అత్తమామ నన్ను కన్న కొడుకు లాగా చూసుకుంటారని పేర్కొన్నారు. నా ఇద్దరు పిల్లలను నేను పోగొట్టుకున్నానని కన్నీరుమున్నీరు అయ్యారు.