JanaSena Candidates lost deposits: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించింది. సీపీఐతో కలిసి 65 స్థానాలను గెలుచుకొన్న కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించింది. బీఆర్ఎస్ 39 సీట్లు గెలవగా.. బీజేపీ 8 స్థానాల్లో, ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచింది. ఇక ఎనిమిది స్థానాల్లో పోటీచేసిన జనసేన.. అన్ని స్థానాల్లోనూ ఓటమి పాలైంది. జనసేన అభ్యర్థులు అందరూ డిపాజిట్లు కోల్పోయారు.
Also Read: Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో భారీ మెజార్టీ ఎవరిదో తెలుసా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసింది. పొత్తులో భాగంగా 11 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన తొలుత భావించినా.. ఆ తర్వాత 8 స్థానాల నుంచి పోటీ చేసింది. కూకట్పల్లి, తాండూరు, కోదాడ, నాగర్ కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. జనసేన తరఫున పలు నియోజకవర్గాలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, కూకట్పల్లిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రచారం చేశారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. కూకట్పల్లి అభ్యర్థి మూమ్మారెడ్డి ప్రేమ్కుమార్కు 39,830 ఓట్లు రాగా.. మిగిలిన అన్ని స్థానాల్లో 5 వేల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.