దేశ వ్యాప్తంగా మంగళవారం రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. అయితే హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్కు మెజార్టీ ఉన్న కూడా సీటు కోల్పోయింది. అనూహ్యంగా ఒక సీటు బీజేపీ ఖాతాలో పడిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడడంతో ఫలితం రివర్స్ అయిపోయింది. దీంతో అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హిమాచల్ప్రదేశ్ ప్రతిపక్ష నేతలు.. కాంగ్రెస్కు బలం లేదని ఫిర్యాదు చేశాయి. మరోవైపు ఈ పరిణామంపై కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది.
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో జరిగిన క్రాస్ ఓటింగ్ వ్యవహారంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ (Jairam Ramesh) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగ్ అంశం నుంచి కాంగ్రెస్ పారిపోవడం లేదని, క్రాస్ ఓటింగ్ జరిగింది నిజమేనని అన్నారు. అయితే.. ఇది ఎందుకు, ఎలా జరిగిందో తెలుసుకుంటున్నామని చెప్పారు. హిమాచల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంప్రదించాలని అధిష్టానం సూచించిందని.. ఎమ్మెల్యేల అభిప్రాయాలతో నివేదిక పంపాలని ఆదేశించిందని చెప్పారు. సిమ్లాకు వెళ్లిన పార్టీ కేంద్ర పరిశీలకులు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారని వివరించారు.
బీజేపీ వెనుక ద్వారం నుంచి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని జైరాం రమేష్ ఆరోపించారు. గతంలోనూ చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఇదే పని చేసిందని గుర్తుచేశారు. హిమాచల్ ప్రజా తీర్పు సుస్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని, దీన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పరోక్షంగా బీజేపీకి చురకలంటించారు. ఎన్నికల ప్రచార సమయంలో తాము ప్రకటించిన గ్యారెంటీలను అమలు చేసే పనిలో ఉన్నామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను పడగొట్టడం, కూలగొట్టడం అన్నదే మోడీ సర్కార్ గ్యారెంటీ అని విమర్శలు గుప్పించారు. కానీ.. ఆ ప్రయత్నాల్ని తాము సఫలం కానివ్వమని ఆయన తేల్చి చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ నుంచి రిపోర్ట్ రాగానే కొన్ని కఠోర నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చని, అయినా సరే వెనుకాడే ప్రసక్తే లేదని జైరాం రమేష్ చెప్పారు. తాము వ్యక్తిగత ప్రయోజనాలు చూడమని, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు.
హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్కు 40, బీజేపీకి 25, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు. అయితే మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండింట్ సభ్యులు బీజేపీ అభ్యర్థికే ఓటు వేశారు. దీంతో రెండు పార్టీలకు సమానంగా సీట్లు రావడంతో అనంతరం లాటరీ ద్వారా ఎంపిక చేయడంతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఆ రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది.
