Israel-Hamas War: హమాస్పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధానిని రెండు వైపులా చుట్టుముట్టారు. ఓ వైపు రఫాలో ఆపరేషన్ ప్రారంభించడంతో అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు గాజా విషయంలో నెతన్యాహుతో సొంత ప్రభుత్వ మంత్రులే విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వంలోని కేబినెట్ మంత్రి కూడా అల్టిమేటం జారీ చేసి మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. అటువంటి పరిస్థితిలో, ఇజ్రాయెల్లోని నెతన్యాహు ప్రభుత్వాన్ని సంక్షోభ మేఘాలు చుట్టుముట్టాయి. సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ ముగ్గురు సభ్యుల యుద్ధ కేబినెట్ సభ్యుడు బెన్నీ గాంట్జ్, గాజాలో యుద్ధానికి కొత్త ప్రణాళికను ఆమోదించకపోతే ప్రభుత్వం నుంచి రాజీనామా చేస్తానని బెదిరించాడు. యుద్ధంపై కొత్త ప్రణాళికను ఆమోదించకుంటే జూన్ 8న పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. హమాస్ను నిర్మూలించడం, అక్టోబర్ 7 దాడిలో కిడ్నాప్ చేయబడిన అనేక మంది బందీలను విడిపించడం కోసం గాజాలో ఏడు నెలలకు పైగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ నాయకత్వంలో చీలికను శనివారం అతని ప్రకటన సూచిస్తుంది.
ఆగ్రహానికి కారణం ఏమిటి?
గాజా తర్వాత నెతన్యాహు రఫాలో యుద్ధాన్ని ప్రారంభించారని, అయితే యుద్ధం ముగిసిన తర్వాత హమాస్ వృద్ధిని ఆపాలనే ఆలోచన తనకు లేదని బెన్నీ గాంట్జ్ చెప్పారు. గాజాపై విజయం సాధించిన తర్వాత అక్కడ ఎలాంటి పాలన ఉంటుందో, ఎవరు పాలిస్తారో తెలియని పరిస్థితి నెలకొందని గాంట్జ్ అంటున్నారు. నెతన్యాహు దీనిపై ఎలాంటి ఒప్పందాన్ని సిద్ధం చేసుకోకుంటే.. ఈ సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగనున్నారు. ఒకవైపు ఇజ్రాయెల్ సైనికులు హమాస్పై ధైర్యసాహసాలు ప్రదర్శిస్తుంటే మరోవైపు తమను యుద్ధానికి పంపిన వారు పిరికితనాన్ని ప్రదర్శిస్తూ తమ బాధ్యతల నుంచి పారిపోతున్నారని ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై విమర్శలు చేశారు.
గాజాలో మరో ఇజ్రాయెల్ బందీ మృతదేహం లభ్యం
మరోవైపు, గాజా స్ట్రిప్ నుంచి మరో ఇజ్రాయెల్ బందీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. 24 గంటల్లో ఇది నాలుగో మృతదేహం. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ దాడిలో రాన్ బెంజమిన్ హతమయ్యాడని ఆర్మీ అధికార ప్రతినిధి అవిచాయ్ ఎడ్రై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. షిన్ బెట్ సెక్యూరిటీ ఏజెన్సీ, సైన్యం సంయుక్తంగా జరిపిన ప్రత్యేక ఆపరేషన్లో రాన్ బెంజమిన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక.. ఆక్టోబర్ 7 నుంచి హమాస్ మిలిటెంట్లు దాడి చేసి ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా తీసుకువెళ్లినందుకు ప్రతీకారంగా గాజాపై విరుచుకుపడుతన్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇప్పటివరకు 34,900 మంది పాలస్తీయన్లు ప్రాణాలు కోల్పోయారు.