టాలీవుడ్ ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో ఉన్న లింగ భైరవి దేవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ది వివాహం’ ద్వారా ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సముల సమక్షంలో జరిగిన ఈ వేడుకను అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికే రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియే ఈ ‘భూత శుద్ది వివాహం’. లింగ భైరవి ఆలయాల్లో లేదా ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ క్రతువు, వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుంది. వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. సమంత, రాజ్ జంటకు ఈశా ఫౌండేషన్ హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపింది. దేవి అపారమైన అనుగ్రహంతో వీరి జీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించింది.
Also Read : Samantha : సమంత పెళ్లి చేసుకున్న రాజ్ నిడమోరు ఎవరో తెలుసా?
లింగ భైరవి గురించి : సద్గురు చేతుల మీదుగా ఈశా యోగ కేంద్రంలో ‘ప్రాణ ప్రతిష్ట’ చేయబడిన లింగ భైరవి దేవి, స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర మరియు కారుణ్య స్వరూపం. జీవితాన్ని సుసంపన్నం చేసే ఎన్నో విశిష్టమైన ఆచారాలకు ఈ ఆలయం నెలవు. విశ్వంలోని సృజనాత్మక శక్తికి ప్రతీకగా నిలిచే ఈ ఎనిమిది అడుగుల శక్తి స్వరూపం భక్తుల మనశ్శరీరాలను, శక్తులను స్టిరపరుస్తూ, జననం నుండి మరణం (ముక్తి) వరకు జీవితంలోని ప్రతి దశలోనూ వారికి అండగా నిలుస్తుంది.