టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమానికి అన్ని వైపుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా కోయంబత్తూరులోని ప్రఖ్యాత ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు ఎంపీ సంతోష్ కుమార్ను మంగళవారం ఉదయం హైదరాబాద్లో కలిశారు. సద్గురు ఆధ్వర్యంలో చేపట్టిన ‘సేవ్ సాయిల్’ ఉద్యమానికి మద్దతివ్వాలని ఎంపీ సంతోష్ను ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు ప్రసాద్, శైలజ, రాఘవ కోరారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పుడమి పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ‘హరా హైతో భరా హై’ అనే గొప్ప నినాదంతో 17 జూలై 2018న తాము ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం నేడు హరిత కార్యక్రమాల్లో గొప్ప విప్లవంగా మారి అనుకున్న లక్ష్యాన్ని చేరిందని ఈశా ఫౌండేషన్ సభ్యులకు వివరించారు.
మట్టికి – మొక్కకు అవినాభావ సంబంధం ఉన్నట్లే ఈశా ఫౌండేషన్ చేపట్టిన సేవ్ సాయిల్ ఉద్యమానికి, తాము చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమానికి కూడా అదే సంబంధం ఉంటుందని ఎంపీ సంతోష్ కుమార్ అభిప్రాయపడ్డారు. అందుకే ‘మట్టిని కాపాడుకుందాం – మొక్కను బతికించుకుందాం’ అని ఆయన అన్నారు. సేవ్ సాయిల్ ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈశా ఫౌండేషన్ చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలను ఈశా ప్రతినిధులు ఎంపీ సంతోష్కు తెలియజేశారు.
సద్గురు ఆధ్వర్యంలో సేవ్ సాయిల్ ఉద్యమంపై దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చేపట్టిన పర్యటనలు విజయవంతమయ్యాయని, ప్రస్తుతం ప్రపంచ యాత్ర జరుగుతుందన్నారు. ఆ యాత్ర విశేషాలను ఎంపీ సంతోష్కు ఈశా ఫౌండేషన్ సభ్యులు వివరించారు. అలాగే త్వరలోనే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈశా ఫౌండేషన్ ఏర్పాటు చేయబోయే సేవ్ సాయిల్ ఉద్యమ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించగా ఎంపీ సంతోష్ కుమార్ సానుకూలంగా స్పందించారు. సేవ్ ఆయిల్ ఉద్యమానికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
